Photo Credit: BCCI Twitter
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేశారు.
కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్నెస్పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది.
అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది.
అందుకే వన్డే ప్రపంచకప్లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్లో ఆల్రౌండర్గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.


