బీసీసీఐ సెలక్టర్లకు అశ్విన్ కీలక సూచన
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2026 కోసం టీమిండియా తమ సన్నహకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు.
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఐపీఎల్తో పాటు దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే భువీలో ఏ మాత్రం జోరు తగ్గలేదు.
ఫిట్గా ఉండి తన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలోనూ ఆర్సీబీ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్ కూడా భువీ తిరిగి పునరాగమనం చేస్తే చూడాలని ఉందని అన్నాడు.
"భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ గురుంచి సెలక్షన్ కమిటీ ఆలోచించాలి. ప్రస్తుతం భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదు. కాబట్టి జట్టుకు భువీ అవసరముందని అనిపిస్తోంది. అయితే మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.
కానీ షమీకి, భువీకి ఒక తేడా ఉంది. భువనేశ్వర్ వరుసగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ఆడినప్పటికి పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. కానీ షమీ మాత్రం ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా భువనేశ్వర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.
అయితే వెంటనే అతడిని జట్టులోకి తీసుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఓ అవకాశమిచ్చి ఇచ్చి చూడండి. అక్కడ రాణించగలిగితే అతడిని జట్టులో కొనసాగించండి. అతడు పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయార్డర్లో బ్యాట్తో రాణించే సత్తా కూడా భువీకి ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.


