అక్షర్- సుందర్ (PC: BCCI X)
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ దుమ్ములేపారు. కెప్టెన్ శుబ్మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్)తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అక్షర్ (57*), వాషీ (52*) ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
ఆల్రౌండ్ ప్రతిభ
ముఖ్యంగా అక్షర్ ఆల్రౌండర్గా తన పూర్తి నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకుని.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తొలుత 9.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ 62 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటర్గానూ సత్తా చాటాడు.
అయితే, వాషీ కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి పదమూడు పరుగులు ఇచ్చి.. వికెట్ లేకుండానే ముగించాడు. మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అతడికి అన్యాయం
ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లనే ఆడించడం సరికాదని.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా తుదిజట్టులో చోటు ఇవ్వాలని అశూ యాజమాన్యానికి సూచించాడు. ‘‘జట్టు కోసం చాలా కాలం కష్టపడ్డ ఆటగాడికి కూడా విలువనివ్వాలి. కానీ మేనేజ్మెంట్ ఇంగ్లండ్లో అతడి (కుల్దీప్)ని ఎందుకో పక్కనపెట్టేసింది.

PC: BCCI
ఒక బ్యాటర్ ఆత్మవిశ్వాసం పెరగాలంటే అతడు ఫామ్లో ఉండటం ఎలా ముఖ్యమో.. ఒక బౌలర్ కూడా రిథమ్, లైన్ అండ్ లెంగ్త్ కొనసాగించాలంటే అతడికి అవకాశాలు ఇవ్వడమూ అంతే ముఖ్యం. నాకైతే కుల్దీప్ విషయంలో మేనేజ్మెంట్ పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించడం లేదు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.
బెంచ్కే పరిమితం చేయడం సరికాదు
ముఖ్యంగా ఈసారి ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరుగబోతోంది. కుల్దీప్ అవసరం అక్కడ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి అతడిని బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. నిజానికి హార్దిక్ పాండ్యా లేడన్న కారణంగా యాజమాన్యం అతడి స్థానంలో శివం దూబేను ఆడిస్తోంది. బౌలర్గానూ అతడి సేవలు వాడుకోవాలనుకుంటోంది.
టీ20 ఫార్మాట్ మాదిరి ఇద్దరు బౌలర్లే ఇక్కడ (వన్డే) నాలుగు ఓవర్లు వేయాల్సిన పనిలేదు. జట్టులో ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు వాషీ, అక్షర్ ఉన్నారు. ఇద్దరూ బ్యాటింగ్ చేయగలరు. కాబట్టి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకుని.. కుల్దీప్ యాదవ్ను ఆడించవచ్చు కదా!’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.


