ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసింది. ఈ టీ20 సిరీస్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 'వర్క్లోడ్ మేనేజ్మెంట్'లో భాగంగా సిరాజ్కు విశ్రాంతినిచ్చినట్లు బోర్డు తెలిపింది. అతడి స్ధానంలో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణను జట్టులో తీసుకున్నారు. అయితే సిరాజ్ స్ధానాన్ని ప్రసిద్ద్ కృష్ణతో భర్తీ చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.
అతడికి బదులుగా వెటరన్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేయాల్సిందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ద్తో పోలిస్తే భువీ ఎంతో బెటర్ అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. భువనేశ్వర్ నవంబర్ 2022 నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 16 మ్యాచ్లలో 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా ఈ యూపీ ఫాస్ట్ బౌలర్కు మంచి రికార్డు ఉంది.
87 మ్యాచ్లు ఆడి 6.96 ఎకానమీ రేట్తో 90 వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల భువీ ఇప్పటికి కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. ఈ ఆర్సీబీ పేసర్ ప్రస్తుతం యువ క్రికెటర్ల కంటే ఫిట్గా కనిపిస్తున్నాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్పటికి సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు.
ప్రసిద్ద్ కృష్ణ విషయానికి వస్తే.. టెస్ట్, వన్డేల్లో టీమిండియా తరపున కాస్త ఫర్వాలేదనిపించినప్పటికి, టీ20ల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి కేవలం 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2026 సీజన్లోనూ ఆశించినంత మేర రాణించలేకపోయాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
చదవండి: ‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’


