టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం.. కెప్టెన్సీకి రాజీనామా | Wanindu Hasaranga Steps Down As Sri Lanka T20I Captain Ahead Of India Series, See Details Inside | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం.. కెప్టెన్సీకి రాజీనామా

Jul 11 2024 7:02 PM | Updated on Jul 11 2024 7:46 PM

Hasaranga

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక గ్రూప్‌ దశలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ స్పష్టం చేశాడు. హసరంగ రాజీనామా విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ధృవీకరించింది.

హసరంగ గతేడాదే శ్రీలంక టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. అతను లంక జట్టు సారథిగా కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో హసరంగ సారథ్యంలో శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒ‍కే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. శ్రీలంక టీ20 జట్టు కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు ఇంకా వేదికలు ఖరారు కాలేదు. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు.. ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

ఈ సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం భారత్‌.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుండగా.. శ్రీలంక ఆటగాళ్లు లంక ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement