పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్‌.. కేవలం 23 బంతుల్లోనే..! | Unsold In IPL 2025 Mega Auction, Prithvi Shaw Slams Quick Half Century In T20 Mumbai League | Sakshi
Sakshi News home page

పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్‌.. కేవలం 23 బంతుల్లోనే..!

Jun 9 2025 12:15 PM | Updated on Jun 9 2025 12:26 PM

Unsold In IPL 2025 Mega Auction, Prithvi Shaw Slams Quick Half Century In T20 Mumbai League

ముంబై టీ20 లీగ్‌లో నార్త్‌ ముంబై పాంథర్స్‌ ఆటగాడు పృథ్వీ షా ఇరగదీశాడు. లీగ్‌లో భాగంగా ట్రయంప్‌ నైట్స్‌తో నిన్న (జూన్‌ 8) జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా కేవలం 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

షా సునామీ హాఫ్‌ సెంచరీతో పాటు హర్షల్‌ జాదవ్‌ (30 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), గౌరవ్‌ జాథర్‌ (10 బంతుల్లో 18 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), రాహుల్‌ సావంత్‌ (9 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాంథర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నైట్స్‌ బౌలర్లలో శ్రేయస్‌ గౌరవ్‌ 2, మినాద్‌ మంజ్రేకర్‌, పరిక్షిత్‌, సుర్యాంశ్‌ షేడ్గే తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్స్‌.. ప్రతిక్‌ మిశ్రా (3.5-0-30-4) రెచ్చిపోవడంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటై 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. పాంథర్స్‌ బౌలర్లలో రాహుల్‌ సావంత్‌ 2, ముజమ్మిల్‌ ఖాద్రి, గౌరవ్‌ జాథర్‌ తలో వికెట్‌ తీశారు. 

నైట్స్‌ ఇన్నింగ్స్‌లో సిద్దాంత్‌ ఆధత్‌రావ్‌ (76) ఒంటరిపోరాటం చేసి 45 బంతుల్లో 76 పరుగులు చేయగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (29), పరిక్షిత్‌ (20), శిఖర్‌ ఠాకూర్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా పాంథర్స్‌, నైట్స్‌ ఇదివరకే లీగ్‌ నుంచి నిష్క్రమించాయి.

ఇదిలా ఉంటే, పృథ్వీ షా ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2025లో ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించలేదు. ఈ సీజన్‌ మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత కొంతకాలంగా షా ఓవర్‌ వెయిట్‌ కారణంగా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటూ తన దేశవాలీ జట్టు ముంబైలో కూడా స్థానం కోల్పోయాడు. 

తాజా ప్రదర్శన తర్వాత షా తిరిగి ముంబై జట్టులో చోటు ఆశిస్తున్నాడు. 2024-25 సీజన్‌లో షా రెండు సార్లు ముంబై జట్టులో స్థానం కోల్పోయాడు. రంజీ జట్టుతో పాటు విజయ్‌ హజారే టీమ్‌ నుంచి డ్రాప్‌ అయ్యాడు. 

2018లో టీమిండియా తరఫున ఘనంగా (తొలి టెస్ట్‌లోనే సెంచరీ) అరంగేట్రం చేసిన షా.. అతి కొద్ది కాలంలోనే ఫిట్‌నెస్‌ సమస్యలు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కనుమరుగయ్యాడు. షా చివరిగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement