ఐపీఎల్ 2027 సీజన్కు ముందు జరిగిన భారీ ట్రేడ్లో రిషబ్ పంత్ లక్నో నుంచి ఢిల్లీకి చేరగా.. ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లిపోయాడు. పంత్ తిరిగి ఢిల్లీకి చేరడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ.. జట్టు కెప్టెన్గా ఎవరుంటారన్నది ప్రస్తుతం అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్గా అక్షర్ పటేల్ కొనసాగుతుండగా.. వచ్చే సీజన్లో అతన్ని తప్పించి కేఎల్ రాహుల్కు పగ్గాలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. ఈలోపే లక్నో కెప్టెన్గా ఉన్న పంత్ ఢిల్లీకి చేరాడు. పంత్ చేరికతో ఢిల్లీ కెప్టెన్సీ కోసం ట్రయాంగులర్ ఫైట్ నెలకొన్నట్లు కనిపిస్తుంది.
2027 సీజన్లో కెప్టెన్గా ఎవరిని నియమించాలని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటినుంచే తలలు పట్టుకొని కూర్చుంది. గత సీజన్కు ముందు తొలుత రాహుల్నే కెప్టెన్గా నియమించాలని డీసీ యాజమాన్యం భావించినప్పటికీ.. అతడు అయిష్టత వ్యక్తం చేయడంతో అక్షర్కు పగ్గాలు అప్పజెప్పింది.
అయితే గత సీజన్లో అక్షర్ జట్టును విజయవంతంగా నడిపించలేకపోవడంతో యాజామాన్యం మరోసారి రాహుల్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈలోపు అనూహ్యంగా పంత్ జట్టులోకి వచ్చాడు. పంత్కు గతంలో డీసీ కెప్టెన్గా ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉండటంతో కెప్టెన్సీ విషయంలో యాజమాన్యం గందరగోళంలో పడింది.
ఈ నేపథ్యంలో తదుపరి సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుందనే చర్చ అభిమానుల్లో జోరందుకుంది. గణాంకాలను బట్టి చూస్తే పంత్ కంటే రాహుల్కే మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. పంత్ 2021 నుంచి 2026 మధ్య 71 మ్యాచ్ల్లో నాయకత్వం (ఢిల్లీ, లక్నో) వహించగా.. 33 విజయాలు, 36 పరాజయాలు, రెండు టై ఫలితాలు నమోదయ్యాయి. అతడి విజయశాతం 46.47 శాతంగా ఉంది.
రాహుల్ విషయానికొస్తే.. 2020 నుంచి 2024 మధ్య అతడు 64 మ్యాచ్ల్లో జట్లను నడిపించాడు. ఇందులో 31 విజయాలు, 31 పరాజయాలు, రెండు టై ఫలితాలు సాధించాడు. అతడి విజయాల శాతం 48.43గా ఉంది.
డీసీ యాజమాన్యం గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే, రాహుల్వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. పైగా అతడు వ్యక్తిగతంగానూ మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా గత రెండు సీజన్లుగా ఢిల్లీ జట్టులో కొనసాగుతూ సహచర ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, యాజమాన్యంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు.
ఈ లెక్కన యాజమాన్యంతో పాటు బృంద సభ్యులు, అభిమానులు రాహుల్కే ఓటేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం యాజమాన్యానిదే.


