జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోర్ (352-8) చేసింది.
మిడిలార్డర్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్కు సహకరించాడు.
ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.
జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.
కాగా, గ్రూప్ దశలో భారత్ వరుసగా యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించి సూపర్ సిక్స్లోకి ప్రవేశించింది. సూపర్ సిక్స్లో భాగంగానే భారత్ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.


