ఆటకు హాకీ స్టార్‌ లలిత్‌ బైబై | Two-time Olympic Medallist Lalit Upadhyay Announces International Retirement, Check Out His Career Best Records | Sakshi
Sakshi News home page

ఆటకు హాకీ స్టార్‌ లలిత్‌ బైబై

Jun 24 2025 8:35 AM | Updated on Jun 24 2025 11:03 AM

Two-time Olympic medallist Lalit Upadhyay announces international retirement

రెండు ఒలింపిక్‌ పతకాల జట్టులో ఫార్వర్డ్‌గా రాణింపు

దశాబ్దపు కెరీర్‌లో 67 గోల్స్‌తో సత్తా

న్యూఢిల్లీ: భారత వెటరన్‌ హాకీ ఆటగాడు లలిత్‌ ఉపాధ్యాయ్‌ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్‌ ఒలింపిక్స్‌లలో కాంస్య పతకం గెలుపొందిన భారత జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా కీలకపాత్ర పోషించాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల లలిత్‌ భావించాడు. 2014 ప్రపంచకప్‌ ద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో అడుగుపెట్టిన ఈ స్టార్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు జట్టు విజయాల్లో తన వంతు పాత్రను నిలకడగా పోషించేవాడు. ఆటలో దూకుడు కనబరిచే అతను తన ప్రవర్తనతో జెంటిల్‌మన్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

తాజా సీజన్‌ ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఆదివారం బెల్జియంతో మ్యాచ్‌ అనంతరం లలిత్‌ ఉపాధ్యాయ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘కేవలం అరకొర వసతులుండే ఓ మారుమూల పల్లెతో మొదలైన నా పయనం సుదీర్ఘకాలం కొనసాగడమే కాదు... నా కలల్ని సాకారం చేసింది. అన్నింటికి మించి దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవాన్నిచ్చింది. రెండుసార్లు పోడియంపై నిల్చోని ఒలింపిక్‌ పతకాలు అందుకోవడం అంతులేని ఆనందాన్నిచ్చింది’ అని తన రిటైర్మెంట్‌ సందేశంలో పేర్కొన్నాడు. అలనాటి హాకీలో ఘనమైన కీర్తిని గడించిన భారత జట్టు... ఆధునిక హాకీలో మాత్రం వెనుకబడింది. 

ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో పోడియంలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగిరేలా చేసింది. తదుపరి పారిస్‌ విశ్వక్రీడల్లోనూ ఈ పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ లలిత్‌ ఉపాధ్యాయ్‌ కేవలం జట్టు సభ్యుడి పాత్రకే పరిమితం కాకుండా... ఫార్వర్డ్‌లో నిలకడను ప్రదర్శించి జట్టు విజయానికి దోహదం చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు. 

పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 183 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన లలిత్‌ 67 గోల్స్‌ సాధించాడు. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (2016, 2018), ఆసియా కప్‌ (2017) విజయాలతో పాటు, హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌ (2017)లో కాంస్యం, 2018 చాంపియన్స్‌ ట్రోఫీ (2018)లో రజతం, ఆసియా క్రీడలు (2018)లో కాంస్యం, 2022లో స్వర్ణం గెలిచిన జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా పలు గోల్స్‌ సాధించాడు. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ (2021–22)లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా ప్లేయర్‌గాను ఉన్నాడు. హాకీ మైదానంలో అతని ప్రదర్శన భారత్‌కు గోల్స్, పతకాలు తెచి్చపెడితే... అతని కృషికి భారత ప్రభుత్వం 2021లో అర్జున అవార్డుతో సత్కరించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement