
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.
కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మూడు టెస్టులు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మొదలైన తొలి టెస్టు (WI vs AUS) మూడు రోజు ఆటలోనే ముగిసింది.
హెడ్ హాఫ్ సెంచరీలు
బార్బడోస్ వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, విండీస్ బౌలర్ల విజృంభణకు ఆసీస్ టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (47) ఫర్యాలేదనిపించగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ అర్ధ శతకం (59)తో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (28) కాసేపు పోరాటం చేశాడు.
ఈ క్రమంలో 56.5 ఓవర్లలోనే ఆసీస్ కథ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా విండీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 190 పరుగులు సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పొరపాట్లను పునరావృతం చేయలేదు.
టాపార్డర్ మరోసారి విఫలమైనా.. ఈసారి హెడ్ (61)తో పాటు బ్యూ వెబ్స్టర్ (63), అలెక్స్ క్యారీ (65) కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో 310 పరుగులు చేసిన కంగారూలు.. ఆతిథ్య జట్టుకు 301 పరుగుల (విండీస్కు తొలి ఇన్నింగ్స్లో 10 పరుగుల ఆధిక్యం) లక్ష్యం విధించారు.
ఆస్ట్రేలియా ఘన విజయం
ఈ క్రమంలో విండీస్ 141 పరుగులకే ఆలౌట్ కావడంతో.. 159 రన్స్తో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 59, రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులతో రాణించి ఇక ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హెడ్ టెస్టు కెరీర్లో ఇది పదో అవార్డు.
తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (2019) మొదలుపెట్టిన తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా హెడ్ చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్గా టెస్టుల్లో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ అత్యధికంగా 23సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.
చదవండి: వరుసగా ఐదు ఓటములు.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సన్రైజర్స్ స్టార్