
రైలు పట్టాలపై ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఓ దివ్యాంగ క్రికెటర్ ఛాతీ నొప్పితో మరణించాడు. అత్యవసర సాయం కోసం రైల్వే వైద్య సిబ్బంది కోసం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చనిపోయిన క్రికెటర్ సహచరులు వాపోతున్నారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్ ఎక్స్ప్రెస్లో జరిగింది.
పంజాబ్కు చెందిన 38 ఏళ్ల దివ్యాంగ క్రికెటర్ విక్రమ్ సింగ్.. ఓ వీల్చైర్ టోర్నమెంట్ కోసం సహచరులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి గ్వాలియర్కు బయల్దేరాడు. ప్రయాణంలో విక్రమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. విక్రమ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. రైల్వే వైద్య సిబ్బందికి అనేక అత్యవసర కాల్స్ చేసినప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. రైలు ఢిల్లీ నుంచి మధుర స్టేషన్కు చేరుకునేలోపే విక్రమ్ మరణించాడు.
కళ్ల ముందే సహచరుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి క్రికటర్ల బాధ వర్ణణాతీతంగా ఉంది. విక్రమ్ నొప్పితో విలవిలలాడిపోయాడని ఓ క్రికెటర్ చెప్పాడు. అత్యవసర వైద్య సాయం కోసం ఎంత సేపు ప్రయత్నించినా రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ మిత్రుడు మరణించాడని మరో క్రికెటర్ వాపోయాడు.
మధుర రైల్వే స్టేషన్లో విక్రమ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. అక్కడే పోస్ట్మార్టమ్ పూర్తి చేశారు. రైల్వే ఉన్నతాధికారులు తమ వైద్య సిబ్బంది ఆలసత్వంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై దివ్యాంగ హక్కుల సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓ దివ్యాంగ క్రీడాకారుడు ఛాతి నొప్పితో విలవిలలాడుతుంటే వైద్య సాయం అందించడానికి ఓ రైల్వే అధికారి కూడా లేకపోవడం సిగ్గు చేటని క్రీడా సమాజం దుమ్మెత్తిపోస్తుంది.