సిరీస్‌ గెలిచే లక్ష్యంతో... | Today is the second T20 between India and Afghanistan | Sakshi
Sakshi News home page

సిరీస్‌ గెలిచే లక్ష్యంతో...

Jan 14 2024 3:35 AM | Updated on Jan 14 2024 10:36 AM

Today is the second T20 between India and Afghanistan - Sakshi

ఇండోర్‌: బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్, చిన్న బౌండరీలు...ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో పరుగుల వరదకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే రెండో టి20 మ్యాచ్‌లో భారత్, అఫ్గనిస్తాన్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌ను గెలిచి 1–0తో ముందంజలో ఉన్న భారత్‌ ఈ మ్యాచ్‌నూ సొంతం చేసుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.  

భారత తుది జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్‌ ఆడని విరాట్‌ కోహ్లి ఇప్పుడు బరిలోకి దిగుతున్నాడు. మరో 35 పరుగులు చేస్తే కోహ్లి టి20 క్రికెట్‌లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. కోహ్లి రాకతో గిల్‌ను పక్కన పెట్టడం ఖాయం. అయితే ఓపెనర్‌ యశస్వి గాయంనుంచి కోలుకుంటే జట్టులోకి వస్తాడు. లేదంటే గిల్‌కు మరో అవకాశం దక్కుతుంది.

బౌలింగ్‌లో కూడా లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు బదులుగా కుల్దీప్‌ యాదవ్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. పేస్‌ విభాగంలోనూ మార్పు అవసరం అనుకుంటే ముకేశ్‌ను పక్కన పెట్టి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అవేశ్‌కు చాన్స్‌ ఇవ్వవచ్చు. మరో వైపు అఫ్గనిస్తాన్‌ మరో సారి తమ స్పిన్‌నే బలంగా నమ్ముకుంటోంది.

ముజీబ్, నబీలు కొనసాగనుండగా ముగ్గురు పేసర్లు ఫజల్, నవీన్, గుల్బదిన్‌లు భారత్‌ బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ను ఎంత వరకు నిలువరిస్తారనేది చూడాలి. మిడిలార్డర్‌లో రహ్మత్‌ స్థానంలో దూకుడైన బ్యాటర్‌ అయిన హజ్రతుల్లా జట్టులోకి వస్తాడు. సంచలన ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేయాలని అఫ్గన్‌ జట్టు భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement