
వరుస విజయాలు సాధిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు
నేడు గుజరాత్ టైటాన్స్తో పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: సీజన్లో ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి...అన్నీ గెలిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్లే ఆఫ్స్కు చేరవచ్చు. నాలుగు గెలిస్తే వేర్వేరు సమీకరణాలు, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఆశలు పెట్టుకోవచ్చు... ఐపీఎల్–2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తాజా పరిస్థితి ఇది. పూర్తిగా దారులు మూసుకుపోకుండా రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో నేడు హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్ను వారి సొంతగడ్డపై సన్రైజర్స్ ఎదుర్కొంటుంది.
ఇరు జట్ల మధ్య ఉప్పల్లో జరిగిన గత మ్యాచ్లో టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్లో జరిగిన ఎనిమిది ఇన్నింగ్స్లలో ఐదుసార్లు 200 పరుగులకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోరుకు అవకాశం ఉంది. శుక్రవారం దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఆటగాళ్లు పోరాడాల్సి రావచ్చు.
సమష్టిగా రాణిస్తేనే...
గత ఏడాదితో పోలిస్తే ఈసారి సన్రైజర్స్ బ్యాటింగ్ చాలా వరకు విఫలమైంది. అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా ఓవరాల్గా ఆశించిన ప్రదర్శన రాలేదు. అయితే ఇప్పటికీ జట్టు విజయావకాశాలు ముగ్గురు బ్యాటర్లు హెడ్, అభిషేక్, క్లాసెన్లపైనే ఆధారపడి ఉన్నాయి. వీరు బాగా ఆడినప్పుడు మాత్రమే టీమ్కు సానుకూల ఫలితం వచి్చంది. ఓపెనర్లుగా హెడ్, అభిషేక్ ఈ సీజన్లో ఓవర్కు 10.89 రన్రేట్తో 316 పరుగులు జోడించారు. మరోసారి వీరిద్దరు సత్తా చాటాల్సి ఉంది.
మిడిలార్డర్లో 156.52 స్ట్రయిక్ రేట్తో క్లాసెన్ ధాటిని చూపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో సెంచరీ తర్వాత వరుసగా విఫలమై గత మ్యాచ్లో రాణించిన ఇషాన్ కిషన్ అదే జోరును కొనసాగించాల్సి ఉంది. మరీ పేలవంగా ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి ఈ సారైనా దూకుడును ప్రదర్శిస్తాడా చూడాలి. బౌలింగ్లో హైదరాబాద్ పరిస్థితి ఏమాత్రం గొప్పగా లేదు. హర్షల్ పటేల్ 13 వికెట్లు తీసినా అందులో లోయర్ ఆర్డర్వే ఎక్కువగా ఉన్నాయి.
కమిన్స్, షమీ, మలింగ పూర్తిగా విఫలమయ్యారు. స్పిన్నర్లు అన్సారీ, కమిందు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ప్రత్యర్థి వేదికపై విజయం దక్కాలంటే సన్రైజర్స్ రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. చెన్నైపై విజయం సాధించిన తర్వాత విహారయాత్రకు వెళ్లి కొత్త ఉత్సాహంతో తిరిగొచి్చన ఆటగాళ్లు మైదానంలో ఎలా చెలరేగుతారనేది ఆసక్తికరం.
సొంతగడ్డపై ఉత్సాహంగా...
రాజస్తాన్తో ఆడిన గత మ్యాచ్లో 209 పరుగులు చేసిన కూడా వైభవ్ సూర్యవంశీ దెబ్బకు గుజరాత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే సీజన్లో ఇప్పటి వరకు టీమ్ నిలకడైన ప్రదర్శనను కనబరుస్తోంది. చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యంతో సాయిసుదర్శన్ (456 పరుగులు), శుబ్మన్ గిల్ (389) శుభారంభాలు అందిస్తుండగా, మూడో స్థానంలో బట్లర్ (406) చెలరేగిపోతున్నాడు. ఈ ముగ్గురితో పాటు చివర్లో రూథర్ఫర్డ్ కూడా 150కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించడం విశేషం.
టాప్–3 కలిసి ఈ సీజన్లో 13 అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. వీరు తమ ఫామ్ను కొనసాగిస్తే సన్రైజర్స్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. బౌలింగ్ విభాగంలోనూ టైటాన్స్ పటిష్టంగా ఉంది. ప్రసిధ్ కృష్ణ (17 వికెట్లు), సాయికిషోర్ (12), సిరాజ్ (12) ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంలో సఫలమయ్యారు. లెగ్స్పిన్నర్ రషీద్ ఖాన్ పెద్ద సంఖ్యలో వికెట్లు తీయలేకపోయినా... భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో 9కంటే తక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్లలో గుజరాత్ మూడు విజయాలు సాధించింది.