
గాలే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక అద్బుతమైన పోరాటం కనబర్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ చేయగా.. శ్రీలంక కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 485 పరుగులకు ఆలౌటై, బంగ్లాదేశ్కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చింది.
368/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో 107 పరుగులు చేసి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ (87) అద్బుతమైన పోరాటం చేసి తన జట్టును బంగ్లాదేశ్ స్కోర్కు దగ్గరగా తీసుకెళ్లాడు. ఇవాళ ఆటలో కమిందు రత్నాయకేతో (39) అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కమిందు ఔటయ్యాక చివరి వరుస బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను అధిగమించలేకపోయింది.
అంతకుముందు పథుమ్ నిస్సంక (187) భారీ సెంచరీతో చెలరేగడంతో లంక ఇన్నింగ్స్ను బలమైన పునాది పడింది. నిస్సంక చండీమల్ (54) సాయంతో లంక ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. ఇతర బ్యాటర్లలో లహీరు ఉడార 29, ఏంజెలో మాథ్యూస్ 39, ధనంజయ డిసిల్వ 19, కుసాల్ మెండిస్ 5, తిరుండ రత్నాయకే 0, అశిత ఫెర్నాండో 4 పరుగులకు ఔటయ్యారు. ప్రభాత్ జయసూర్య 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నయీమ్ హసన్ 5 వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, తైజుల్ ఇస్లాం, మొమినుల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (350 బంతుల్లో 163; 9 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(279 బంతుల్లో 148; 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (123 బంతుల్లో 90; 11 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. మిలన్ రత్నాయకే, తరిందు రత్నాయకే తలో 3 వికెట్లు సాధించారు.