source: X
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో శీతల్, కజకిస్థాన్కు చెందిన ఐజాడా సెయ్దాన్ను షూట్ఆఫ్లో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ టోర్నీలో శీతల్కు ఇది రెండో పతకం. టోమన్ కుమార్తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆమె ఇప్పటికే కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భారత జోడీ ఇరాక్కు చెందిన సారా అల్ హమీద్, అబ్బాస్ కదిమ్ జోడీని 157-145తో ఓడించింది.
మరోవైపు పారాలింపిక్ ఛాంపియన్ హర్విందర్ సింగ్ కూడా భారత్కు స్వర్ణ పతకం అందించాడు. భావనతో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్ కియురోంగ్, షియా లెయ్ జోడీని 6-0తో ఓడించారు.
భావన రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో సరిత చైనాకు చెందిన వాంగ్ హ్యూటింగ్పై 141-140తో విజయం సాధించి కాంస్యం గెలిచింది.కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో టోమన్ కుమార్ కూడా కాంస్య పతకం సాధించాడు.ఈ టోర్నీలో టోమన్కు ఇది రెండో పతకం.
మొత్తంగా చివరి రోజున భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి, టోర్నీలో పతకాల సంఖ్యను 13కు పెంచుకుంది.
చదవండి: అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్


