టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరుగుతున్న స్టేజీ-3 ఆర్చరీ వరల్డ్కప్లో భారత్కు ఇవాళ (జూన్ 14) రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు గెలిచి భారత్కు చారిత్రక విజయాలు అందించాడు. తొలుత మిక్స్డ్ టీమ్ విభాగంలో కుమ్కుమ్ మొహద్తో కలిసి స్వర్ణం సాధించిన ధీరజ్, ఆతర్వాత పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ విజేతగా నిలిచి భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశాడు.
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో ధీరజ్ 7-3 తేడాతో దక్షిణ కొరియా ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ వూ సియోక్ను ఓడించాడు. అంతకుముందు సెమీఫైనల్లో జర్మనీకి చెందిన మోర్టిగజ్ వీసర్పై 1-3తో వెనుకబడి కూడా 6-4తో విజయం సాధించి అద్భుత పోరాటపటిమ ప్రదర్శించాడు.
ధీరజ్కు ఇది ఆర్చరీ వరల్డ్కప్లో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం. మొత్తంగా నాలుగో పతకం. గతంలో అతను సాధించిన మూడు పతకాలు కాంస్యాలే. 2021లో అతాను దాస్ స్వర్ణం గెలిచిన తర్వాత వరల్డ్కప్ స్థాయిలో భారత పురుషుల రికర్వ్ విభాగానికి లభించిన తొలి వ్యక్తిగత స్వర్ణం ఇదే. భారత తరఫున వ్యక్తిగత రికర్వ్ విభాగంలో వరల్డ్కప్ స్వర్ణం గెలిచిన మూడో ఆటగాడిగానూ ధీరజ్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు జయంత తాలుక్దార్, అతాను దాస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.


