వచ్చే నెలలో అఫ్గానిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెస్టు మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్ నిలిచిన నబీని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు. కనీసం శ్రీలంక-ఎతో జరగనున్న సిరీస్లకు కూడా నబీని అజిత్ అగార్కర్ అండ్ కో పరిగణలోకి తీసుకోలేదు. ఆకిబ్ నబీ బదులుగా పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
తాజాగా ఇదే విషయంపై భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న అకిబ్ నబీని జట్టులోకి తీసుకోకపోవడం అత్యంత హాస్యాస్పదమని అతడు మండిపడ్డాడు.
"అకిబ్ నబీని అఫ్గాన్తో టెస్టులకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కేవలం నబీకి మాత్రమే జరిగిన అన్యాయం కాదు, రంజీ ట్రోఫీకి ఆస్తిత్వానికి జరిగిన అవమానం. గతంలో ఇలాంటి అన్యాయం జరిగితే నాలు ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపేవారు. ఇప్పుడు ఆ వ్యతిరేకత కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది.
మహమ్మద్ సిరాజ్, బుమ్రా వంటి సీనియర్ బౌలర్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు కూడా దేశవాళీ క్రికెట్లో అగ్రస్ధానంలో ఉన్న బౌలర్ ఎంపిక చేయకపోవడం అత్యంత హాస్యాస్పదం. అలాంటప్పుడు రంజీ ట్రోఫీని నిర్వహించడం ఎందుకు? ఆ టోర్నీ ఆపేయడం మంచిది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
కాగా నబీ రెడ్ బాల్తో ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి నబీ ఏకంగా 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. గత సీజన్లో నబీ 10 మ్యాచ్లు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.
చదవండి: IPL 2026: గుజరాత్ కొంపముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్కే?


