
టి20 వరల్డ్ కప్ మ్యాచ్పై రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం... జూన్ 29న భారత జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007లోనూ టి20 వరల్డ్ కప్ విజయంలో భాగంగా ఉన్న రోహిత్ నాయకుడిగా సాధించిన తొలి టి20 టోర్నీ ఇది. ఈ టోర్నమెంట్లో ఎప్పటిలాగే పాకిస్తాన్తో మ్యాచ్తో పాటు సెమీస్కు ముందు ఆ్రస్టేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ నేపథ్యంలో ‘జియో–హాట్స్టార్’ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ నాటి మ్యాచ్లకు సంబంధించి పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు.
ఆ్రస్టేలియాతో పోరులో భారత్ 24 పరుగులతో విజయం సాధించింది. 41 బంతుల్లోనే 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ... స్టార్క్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్స్లు, ఫోర్తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అంతకుముందు ఏడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా తీవ్ర నిరాశకు లోనైంది. ఆ ఓటమి తమ మనసుల్లోనే ఉండటంతో ఆసీస్పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగామని రోహిత్ చెప్పాడు. ‘మేం ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న మాట చాలు మాలో స్ఫూర్తి నింపడానికి.
నవంబర్ 19న మాతో పాటు మన దేశ అభిమానులందరికీ ఆనందం దూరం చేశారనే విషయం మనసులో మెదులుతూనే ఉంది. కాబట్టి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాం. అయితే అది అంత సులువు కాదని, మైదానంలోనే చూపించాలని భావించాం. అందుకే ఒక్కసారి బ్యాటింగ్కు దిగగానే నేను ఏం చేయగలనో అది చేశాను. స్టార్క్తో గతంలో చాలాసార్లు తలపడ్డా. ఈసారి అతడు నన్ను అవుట్ చేయడానికి కాకుండా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది. అక్కడే నేను సగం గెలిచాను. ఆపై విరుచుకుపడ్డాను. సెంచరీలు సాధించడం గొప్పే.
కానీ మ్యాచ్ పరిస్థితి, దికను బట్టి చూస్తే ఈ ఇన్నింగ్స్ సెంచరీకంటే ఎంతో విలువైంది. నాకు సంబంధించి ఇది నా అత్యుత్తమ ప్రదర్శన’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా 140 చేస్తే గెలుస్తామని భావించామని... 119 పరుగులు చేసిన తర్వాత కూడా 2–3 వికెట్లు తీస్తే పాక్ను ఓడించగలమని నమ్మకం ఉందని చెప్పాడు. నిజానికి మ్యాచ్ ఫలితంకంటే దానికి ముందు ఉండే హడావిడే ఎప్పుడూ ప్రత్యేకమని అతను అన్నాడు. ‘బయట మాకు ముప్పు ఉందని చెబుతూ మ్యాచ్కు రెండు రోజుల ముందు నుంచి కూడా హోటల్ బయటకు మమ్మల్ని వెళ్లనీయలేదు.
మీడియా, అభిమానులతో నిండిపోయిన హోటల్ కనీసం నడవడానికి కూడా వీలు లేని విధంగా మారిపోయింది. అప్పుడు ఇది సాధారణ మ్యాచ్ కాదని మాకు అర్థమైంది. గ్రౌండ్కు వెళ్లిన తర్వాత కూడా ఇరు దేశాల అభిమానుల జోష్ను చూస్తే ఆశ్చర్యం వేసింది. పాకిస్తాన్పై నేను ఎన్నో మ్యాచ్లు ఆడాను. కానీ ఆటకు ముందు కనిపించే వాతావరణం ప్రత్యేకతే వేరు. దానికి ఏదీ సాటి రాదు’ అని రోహిత్ శర్మ వివరించాడు.