Photo Credit: ECB X
టీమిండియాతో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్డౌన్ బ్యాటర్.. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.
ఈ మ్యాచ్లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇంగ్లండ్ తొలి క్రికెటర్గా రికార్డు
ఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు.

ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.
కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.
రోహిత్ భారీ శతకం
ఈ క్రమంలోనే లార్డ్స్లో ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.
మీరు తప్పు చేస్తున్నారు
ఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.
అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.
చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్


