PC: BCCI X
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్మ్యాన్’ లార్డ్స్లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.
కాగా ఇంగ్లండ్తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.
లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్
అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో గెలిచేందుకు ఇంగ్లండ్కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్కు హైలైట్.
ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు.
వాళ్లు తలచుకుంటేనే..
అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
భారత క్రికెట్కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.
ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్బై చెప్పారు. వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.


