పంత్‌పై ప్రశంసల వర్షం​ కురిపిం​చిన రోహిత్‌ | Rohit Sharma Comments After India Vs Bangladesh First Test Match | Sakshi
Sakshi News home page

పంత్‌పై ప్రశంసల వర్షం​ కురిపిం​చిన రోహిత్‌

Sep 22 2024 5:13 PM | Updated on Sep 22 2024 5:13 PM

Rohit Sharma Comments After India Vs Bangladesh First Test Match

చెన్నై టెస్ట్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది. అశ్విన్‌ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీయగా.. గిల్‌ (119 నాటౌట్‌), పంత్‌ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్‌ అనంతరం భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ సెకండ్‌ ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో రిషబ్‌ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్‌ కష్ట సమయాల్లో (కారు ప్రమాదం అనంతరం) తనను తాను మేనేజ్‌ చేసుకున్న తీరు అద్భుతమని కొనియాడాడు. ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత వరల్డ్‌కప్‌ టోర్నీని విజయవంతంగా ముగించి, ఇప్పుడు తనకెంతో ఇష్టమైన టెస్ట్‌ ఫార్మాట్‌లో సెంచరీతో చెలరేగాడని అభినందించాడు. 

పంత్‌కు సంబంధించి బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌లో ఏమి చేస్తాడన్నది మాకు ముఖ్యం కాదు. అతను ఏమి చేయగలడో మాకు బాగా తెలుసు. అతనికి తగినంత సమయం ఇవ్వడమే మాకు ముఖ్యమని అన్నాడు.

మ్యాచ్‌ ఫలితంపై రోహిత్‌ మాట్లాడుతూ.. మా ముందున్న బిజీ షెడ్యూల్‌ను బట్టి చూస్తే ఇది చాలా గొప్ప విజయం. ఈ విజయం చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్‌లో మంచి లీడ్‌ను సాధించి, ఆశించిన ఫలితం పొందాం. భారత్‌లో ఆడినా.. విదేశాల్లో ఆడినా బలమైన బౌలింగ్‌ చుట్టూనే జట్టును నిర్మించాలని అనుకుంటున్నాం. ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదురైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాం. అంతిమంగా జట్టు మొత్తానికి క్రెడిట్‌ ఇవ్వాలి.

బాధ్యత ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు దాన్ని తమ భుజాలపైకి ఎత్తుకుంటారు. ఎర్ర మట్టి పిచ్‌పై ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. కొంచెం ఓపికగా ఉంటే బ్యాటింగ్‌లోనైనా, బౌలింగ్‌లోనైనా సత్ఫలితాలు సాధించగలం. ఈ మ్యాచ్‌లో మేము అదే పని చేశాం.

అశ్విన్‌ గురించి మాట్లాడుతూ.. జట్టుకు అతని అవసరం ఉన్న ప్రతిసారి బంతితో లేదా బ్యాట్‌తో చెలరేగుతాడు. అతని గురించి నేను మాట్లాడటం కన్నా అతనే చెప్పడం బాగుంటుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను ముందువరుసలో బ్యాటింగ్‌ చేయడం ఈ మ్యాచ్‌లో భారత్‌కు కలిసొచ్చిందని రోహిత్‌ అన్నాడు.

చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement