
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్.. 11 ఏళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది.
పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) ఆజేయంగా నిలిచి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
18 ఏళ్లలో ఒకే ఒక్కడు..
18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్లో కెప్టెన్గా ఢిల్లీ జట్టును ఫైనల్కు చేర్చాడు. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై ఢిల్లీ బోల్తా పడింది.
అనంతరం ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ను ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. ఇప్పుడు పంజాబ్ను ఫైనల్కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
చదవండి:అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్