టీ20 వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌గా పాకిస్తాన్‌ | Pakistan Win First Ever Blind T20 World Cup By Defeating Bangladesh In Final | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌గా పాకిస్తాన్‌

Dec 3 2024 3:55 PM | Updated on Dec 3 2024 4:31 PM

Pakistan Win First Ever Blind T20 World Cup By Defeating Bangladesh In Final

పాకిస్తాన్‌ అంధుల క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్‌ 3) జరిగిన ఫైనల్లో పాక్‌ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్‌ (పాకిస్తాన్‌) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆరిఫ్‌ హుస్సేన్‌ (54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో బాబర్‌ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్‌ సల్మాన్‌, మతివుల్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. కేవలం 11 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ నిసార్‌ అలీ అజేయమై అర్ద సెంచరీతో (72) సత్తా చాటగా.. మరో ఓపెనర్‌ మొహమ్మద్‌ సఫ్దార్‌ అజేయమైన 47 పరుగులు చేసి తన జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 12 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్‌ టైటిల్‌ గెలవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియా విజేతగా నిలిచింది.

టోర్నీ తొలి ఎడిషన్‌ ఫైనల్లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్‌.. రెండో ఎడిషన్‌ ఫైనల్లోనూ పాక్‌పై 9 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2022 ఎడిషన్‌ ఫైనల్లో భారత్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఎట్టకేలకు పాక్‌ నాలుగో ప్రయత్నంలో సొంతగడ్డపై టైటిల్‌ సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్‌ పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియాను పాక్‌కు పంపలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement