Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి.
అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు.
ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఫిఫా సెమీస్లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.
అసలు వివాదం ఏమిటి?
అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.
దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది.
Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV
— The Resonance (@Partisan_12) July 16, 2026


