ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనుంది. ఏ టోర్నీలో అయినా తమ దేశం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే సదరు దేశాధ్యక్షుడు లైవ్లో చూడాలని ఆశించడం సహజం. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తున్నారు. మూడ నమ్మకాల నెపంతో అర్జెంటీనా ఆడనున్న ఫిఫా పైనల్ మ్యాచ్ను లైవ్లో కాకుండా ఇంట్లోనే టీవీలో వీక్షించాలని నిర్ణయించుకున్నారు.
గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు లైవ్లో ఫిఫా మ్యాచ్ చూడడం వల్ల అర్జెంటీనా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో సదరు అధ్యక్షుడిపై ‘అపశకునం’ ముద్ర వేశారు. దీంతో ఆ సెంటిమెంట్కు భయపడి తాజా ఫిఫా ఫైనల్కు జావియర్ మిలే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఫిఫా ఫైనల్కు జావియర్ మిలే దూరమవ్వడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది.
మూడనమ్మకమా లేదా సెంటిమెంట్.. ఇలా ఏది అనుకున్నా తాను మాత్రం ఫైనల్ మ్యాచ్ను మాత్రం టీవీలోనే వీక్షిస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే అధికారులకు తెగేసి చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మెస్సీకి వీరాభిమాని అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈసారి ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్లను తన ఇంటిలోనే వీక్షించారు. ఈ ఏడింటిలో ఒక్క ఓటమి, డ్రా కానీ చేసుకోని అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టింది.
మరో విశేషమేమిటంటే జావియర్ మిలే తన హెవి జాకెట్ను ధరించి ఈ మ్యాచ్లన్నింటిని వీక్షించారట. కాబట్టి ఫైనల్ మ్యాచ్కు కూడా అదే హెవీ జాకెట్ను ధరించనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో మూడ నమ్మకాలు కొత్తవేమి కావు. ఇంగ్లండ్తో సెమీఫైనల్ సందర్భంగా అర్జెంటీనా అభిమానులు మూడ నమ్మకాల పేరిట కాబాలస్ (ప్రీజర్లో ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలు ఉంచడం) సహా చాలా మంది అభిమానులు అర్జెంటీనా గెలవాలంటూ తాము నమ్మే దైవాన్ని ప్రార్థించడం వైరల్గా మారింది.
తాజాగా ఒక దేశాధ్యక్షుడే ఇవాళ మూడ నమ్మకం పేరుతో ఫైనల్ మ్యాచ్ను లైవ్లో కాకుండా ఇంట్లోనే చూస్తానని చెప్పడం ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడు కావడంతో జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్కు ప్రత్యేక ఆహ్వానం కూడా వచ్చింది.
'మీ స్నేహితుడు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోలతో కలిసి ఆదివారం ఫిఫా పైనల్ చూసేందుకు న్యూజెర్సీ వెళ్తున్నారా' అని అడిగితే.. 'లేదు అస్సుల వెళ్లను.. ఒలివోస్లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తాను' అని అర్జెంటీనా అధ్యక్షుడు బదులివ్వడం విశేషం.
అధ్యక్షుడిపై అపశకునం ముద్ర
తమ జట్లకు దురదృష్టం వెంటాడుతుందేమోనని అర్జెంటీనా అధ్యక్షులు చాలా కాలంగా కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్లకు హాజరయ్యే విషయంలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ మూఢనమ్మకం 1990 టోర్నమెంట్ నాటిది. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్.. ఆనాటి ప్రపంచకప్లో కామెరూన్, అర్జెంటీనా మ్యాచ్కు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు కామెరున్ జట్టుతో పోరులో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అధ్యక్షుడు మెనెమ్పై “ముఫా (అపశకునం) అని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్ ఎక్కడ జరిగినప్పటికీ ఏ అర్జెంటీనా అధ్యక్షుడు కూడా జాతీయ జట్టు మ్యాచ్కు హాజరుకాకపోవడం విశేషం.
చదవండి: అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్ను వణికిస్తున్న గాయం!


