టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21–16, 21–14తో ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై సంచలన విజయం సాధించింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది.
హాన్ యువెపై సింధుకిది ఎనిమిదో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. వీరిద్దరు ఇప్పటి వరకు 20 సార్లు ముఖాముఖి తలపడ్డారు. 11 సార్లు సింధు, 9 సార్లు ఒకుహారా గెలుపొందారు.
ఈ ఏడాది సింధు పది టోర్నీల్లో బరిలోకి దిగగా... ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ ద్వయం 20–22, 17–21తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది.


