స్వియాటెక్‌కు షాక్‌ | A huge sensation was recorded in the womens singles at Wimbledon | Sakshi
Sakshi News home page

స్వియాటెక్‌కు షాక్‌

Jul 5 2026 4:13 AM | Updated on Jul 5 2026 4:13 AM

A huge sensation was recorded in the womens singles at Wimbledon

మూడో రౌండ్‌లోనే ఇంటిబాట

లండన్‌: గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో శనివారం మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) మూడో రౌండ్‌లోనే ఓడి నిష్క్రమించింది. 29వ సీడ్‌ అలెగ్జాండ్రా ఇయాలా (ఫిలిప్పీన్స్‌) 7–6 (11/9), 6–2 స్కోరుతో స్వియాటెక్‌ను చిత్తు చేసింది. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇయాలా 4 ఏస్‌లు కొట్టింది. ఏకంగా 44 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌లో స్వియాటెక్‌ తన ఓటమిని ఆహ్వానించింది. 2022 వింబుల్డన్‌ విజేత, రెండో సీడ్‌ ఎలెనా రిబాకినా (కజకిస్తాన్‌) కూడా మూడో రౌండ్‌లోనే ఓటమిపాలైంది. 27వ సీడ్‌ ఎలైజ్‌ మెర్టెన్స్‌ 7–6 (7/4), 6–1 తేడాతో రిబాకినాను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 

గత ఏడాది రన్నరప్, 6వ సీడ్‌ అమందా అనిసిమోవా (అమెరికా)కు కూడా ఇదే ఫలితం ఎదురైంది. అమెరికాకే చెందిన 26వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ 3–6, 6–2, 6–3తో అనిసిమోవాను ఓడించింది. అయితే మరో మూడో రౌండ్‌ పోరులో ఏడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6–3, 6–7 (5/7), 6–2తో క్లెయిర్‌ ల్యూ (అమెరికా)పై విజయం సాధించి ముందంజ వేసింది. పురుషుల విభాగంలో 2వ సీడ్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌ మ్యాచ్‌లలో విజయాలు సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టారు.   మరోవైపు సింగిల్స్‌ తొలి రౌండ్‌లోనే ఓడిన సెరెనా విలియమ్స్‌ (అమెరికా)... డబుల్స్‌ బరి నుంచి తప్పుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement