Photo Credit: FIFA X
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్కు దూసుకువెళ్లింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.
ఇక సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.
చిరకాల ప్రత్యర్థులు
ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది. కాగా క్రికెట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ల మాదిరే ఫుట్బాల్లో అర్జెంటీనా- ఇంగ్లండ్ మ్యాచ్లకూ అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇందుకు ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాలు.. తదనుగుణంగా చెలరేగే భావోద్వేగాలు కారణం అని చెప్పవచ్చు.
అసలు వివాదం ఏమిటి?
అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.
దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
24 ఏళ్ల తర్వాత తొలిసారి
అయితే, ఫాక్లాండ్ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా- ఇంగ్లండ్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం వచ్చింది.
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గట్లు రాణించింది. అర్జెంటీనా తరఫున 85వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండెజ్, అదనపు సమయం (90+2వ నిమిషం)లో మార్టినేజ్ చెరో గోల్ గొట్టారు.
ఇక వీరిద్దరు గోల్స్ సాధించడంలో కెప్టెన్ మెస్సీ సహకారం అందించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ తరఫున ఆంటోనీ గార్డన్ 55వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
షాక్ తప్పదా?
ఈ నేపథ్యంలో ఓవైపు టైటిల్ సమరానికి మరోసారి అర్హత సాధించడం.. మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను ఓడించిన సంబరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫాక్లాండ్ దీవులు తమవే అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించారు.
Argentina Team with The Falkland Islands Banner 😂😂😂! pic.twitter.com/NlSUZXXlsS
— The Final Whistle (@Rufus_45) July 16, 2026
అయితే, అర్జెంటీనా ఆటగాళ్లపై అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ.. ముందుగా బ్యానర్ ప్రదర్శించిన ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
IFAB నిబంధనల ప్రకారం.. మైదానంలో ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన విషయాలకు సంబంధించి.. అదే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం, ఫొటోలు ప్రదర్శించడం నిషిద్ధం.
ఆటగాళ్లు తమ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగతమైన అభిప్రాయాలను లోదుస్తుల ద్వారానైనా ప్రదర్శించడం.. లేదంటే అందుకు సంబంధించిన లోగో ఉన్న అండర్గార్మెంట్ ధరించడం చేయకూడదు. ఒకవేళ ఆటగాళ్లు ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే సదరు ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధిస్తారు. జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ లేదంటే ఫిఫా ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.
అర్జెంటీనా వైస్ ప్రెసిడెండ్ మద్దతు
అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు విక్టోరియా విలారుయెల్ మాత్రం తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ‘‘ఫాక్లాండ్స్ ఎప్పటికీ అర్జెంటీనావే! వాళ్లు స్టేడియంలోకి బ్యానర్ తీసుకురాకుండా నిషేధం విధించారు. కానీ ఈ భావం మా నరనరాల్లో, హృదయాల్లో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ రికార్డు బద్దలు
¡Las Malvinas son Argentinas! 🇦🇷 Prohibieron llevarlas a la cancha y se olvidaron que las llevamos en la sangre y el corazón. pic.twitter.com/qB455HeqVX
— Victoria Villarruel (@VickyVillarruel) July 15, 2026


