పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ అబ్రార్ అహ్మద్కు భారత యాజమాన్యంలో నడిచే ఓ ఫ్రాంచైజీకి ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతిచ్చింది. అబ్రార్ సహా 21 మంది పాక్ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసింది.
అబ్రార్ను కొద్ది రోజుల కిందట జరిగిన ద హండ్రెడ్ లీగ్ వేలంలో సన్రైజర్స్ లీడ్స్ అనే ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్లోని సన్రైజర్స్ హైదరాబాద్కు సిస్టర్ ఫ్రాంచైజీ. ఈ రెండు ఫ్రాంచైజీలు సన్ గ్రూప్ సహా అధినేత్రి కావ్యా మారన్కు చెందినవి. భారత యజమానికి చెందిన ఫ్రాంచైజీలో పాక్ ఆటగాడిని చేర్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా ఉండింది.
ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు కూడా అబ్రార్కు ఎన్వోసీ ఇవ్వడంతో క్రికెట్ అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. అబ్రార్ను సిగ్గులేని వాడని భారత క్రికెట్ అభిమానులు హేళన చేస్తున్నారు. భారత యజమాని కింద ఆడటానికి అనుమతిచ్చినందుకు పాక్ క్రికెట్ బోర్డుపై సైతం వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు.
గతంలో అబ్రార్ భారత్కు వ్యతిరేకంగా సోషల్మీడియాలో కామెంట్లు చేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అబ్రార్ అహ్మద్ను కావ్వా మారన్ దాదాపు రెండున్నర కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, అబ్రార్తో పాటు షాదాబ్ ఖాన్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్దుల్లా షఫీక్, ఉస్మాన్ తారిక్, మహ్మద్ హారిస్, సుఫ్యాన్ మొకీమ్ తదితరులు హండ్రెడ్ లీగ్, లంకా ప్రీమియర్ లీగ్ (LPL), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), గ్లోబల్ సూపర్ లీగ్ (GSL) వంటి టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతులు పొందారు.


