పాకిస్తాన్ యువ ఆల్రౌండర్ హంజా నజర్కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను నజర్పై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది. అంతేకాకుండా 1 మిలియన్ పాకిస్తానీ రూపాయల జరిమానా చెల్లించాలని కూడా బోర్డు ఆదేశించింది.
నజర్ సమర్పించిన సమాచారంపై విచారణ జరిపేందుకు పీసీబీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన హంజా తన వివరణ ఇచ్చినా, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండేళ్ల కాలంలో హంజా నజర్ ఎలాంటి క్రికెట్ టోర్నీల్లో కూడా భాగం కాకూడదు. కాగా 31 ఏళ్ల హంజా ఇంకా పాక్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనకు అతడు పాక్ తరపున వెళ్లాల్సి ఉండేది. కానీ ఈ వీసా వివాదం కారణంగానే అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు.
సియాల్కోట్కు చెందిన హంజా నజర్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. క్వాయిడ్-ఎ-ఆజమ్ ట్రోఫీ 2025లో 245 పరుగులు చేయడంతో పాటు 18 వికెట్లు తీసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. రెడ్బాల్ క్రికెట్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్గా 175గా ఉంది. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికి పీసీబీ నిబంధనలను ఉల్లఘించించడం వల్ల హంజా కెరీర్లో సందిగ్ధంలో పడింది.
చదవండి: IND vs SL: టీమిండియాతో టెస్టు సిరీస్.. శ్రీలంకకు డబుల్ షాక్!?


