WTC 2021-23: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఓటమి.. పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌

Pakistan Out Of WTC 2021 23, After Defeat Against England In 2nd Test - Sakshi

ICC World Test Championship 2021-23 Updated Points Table: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో ఓటమిపాలై, స్వదేశంలో 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరిన పాకిస్తాన్‌.. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి ఆరో ప్లేస్‌కు పడిపోయి నిరాశగా ఫైనల్‌ రేసు నుంచి వైదొలిగింది.  
 
మరోవైపు 22 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌.. 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్‌ను వెనక్కునెట్టి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని ఇదివరకే కోల్పోయిన ఇంగ్లండ్‌.. అద్భుతమైన రీతిలో పుంజుకుని మిగతా జట్లకు షాకిస్తుంది. 

ఇదిలా ఉంటే, విండీస్‌పై స్వదేశంలో 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉండగా, టీమిండియా నాలుగో ప్లేస్‌లో కొనసాగుతుంది. ఈ ఏడిషన్‌ రెండో ఫైనల్‌ బెర్త్‌ కోసం టీమిండియా.. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పోటీపడుతుంది. ఈ ఏడాది టీమిండియా మరో ఆరు టెస్ట్‌లు ఆడాల్సి ఉండగా.. అన్నింటిలో గెలిస్తే ఫైనల్లో ఆసీస్‌తో తలపడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top