భారత్తో క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి అతడి భార్య టీమిండియానే గెలవాలని కోరుకుంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత్లో (హర్యానా) జన్మించిందన్న విషయం చాలామందికి తెలీదు. ఆమె ఫరీదాబాద్లోని మానవ్ రచనా యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివింది. అనంతరం దుబాయ్లోని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ ఇంజినీర్గా పని చేసింది. అక్కడే హసన్ అలీతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2019లో వీరిద్దరూ దుబాయ్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నేను కూడా బాగా ఆడాలని కోరుకుంటుంది..!
‘పాక్ ప్యాషన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసన్ అలీకి ఓ సరదా ప్రశ్న ఎదురైంది. "మీ భార్య భారతీయురాలు కాబట్టే పాకిస్తాన్ భారత్పై గెలవకూడదని కోరుకుంటుందా? అందుకే పాక్ జట్టు ఓడిపోతుందా?" అని ప్రశ్నించగా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
తన భార్య సమియా అర్జూ భారతీయురాలు కావడంతో సహజంగానే భారత జట్టుకు మద్దతు ఇస్తుందని, అయితే అదే సమయంలో తాను పాకిస్తాన్ తరఫున బాగా ఆడాలని కూడా కోరుకుంటుందని తెలిపాడు.
"ఆమె నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. కానీ ఆమె భారతీయురాలు కాబట్టి భారత్ గెలవాలని కూడా కోరుకుంటుంది. అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు" అని హసన్ అలీ వ్యాఖ్యానించాడు.
అదే భారత్ విజయ రహస్యం
భారత్ వరుసగా పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించడానికి అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు హసన్ అలీ మరింత ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. భారత క్రికెట్ వ్యవస్థ ప్రస్తుతం సరైన దిశలో సాగుతోందని, ముఖ్యంగా ఐపీఎల్, దేశీయ క్రికెట్ వ్యవస్థ ఆటగాళ్లకు ఏడాది పొడవునా నాణ్యమైన పోటీని అందిస్తున్నాయని పేర్కొన్నాడు. అదే భారత జట్టు ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉంటే, హసన్ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్లో యార్క్షైర్ తరఫున ఆడుతున్నాడు. గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. వన్డేలు, టీ20ల్లో అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ జాతీయ జట్టులో స్థిర స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు.


