
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఈ సిరీస్లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 39 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ స్పిన్నర్ స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, నల్లపు రెడ్డి చరణి తలా రెండు వికెట్లు సాధించారు.
లంక బ్యాటర్లలో హసనీ పెరీరా(30) టాప్ స్కోరర్గా నిలవగా.. కవిషా దిల్హారి(25), సంజీవనీ(22) రాణించారు. కెప్టెన్ ఆతపట్టు(7)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలో చేధించింది.
భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. మంధాన(43), డియోల్(48 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర ఒక్క వికెట్ సాధించారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 29న కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
చదవండి: IPL 2025: ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ