కోపంతో ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్‌!.. మద్దతుగా పీసీబీ ప్రకటన | PCB Steps In After Pakistan Cricketer Khushdil Shah Conduct With Fans During NZ ODI Creates Massive Controversy | Sakshi
Sakshi News home page

NZ Vs PAK: పాక్‌ జట్టుకు చేదు అనుభవం.. కోపంతో ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్‌.. పీసీబీ వివరణ

Apr 5 2025 6:12 PM | Updated on Apr 5 2025 6:30 PM

NZ vs Pak: PCB Reacts After Khushdil Conduct With Fans Creates Controversy

న్యూజిలాండ్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగింది. కివీస్‌తో మూడో వన్డే (NZ vs Pak 3rd ODI)లోనూ రిజ్వాన్‌ బృందం ఓటమి పాలైంది. మౌంట్‌ మౌంగనూయ్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ కివీస్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌- పాక్‌ మధ్య మూడో వన్డే ముగిసిన తర్వాత పాకిస్తానీ ఆటగాళ్లకు ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది క్రికెట్‌ ప్రేమికులు పాక్‌ ప్లేయర్లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్‌
ఈ నేపథ్యంలో బారికేడ్‌ దగ్గరగా ఉన్న పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌, బెంచ్‌కే పరిమితమైన ఖుష్దిల్‌ షా (Khushdil Shah) తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తమను కామెంట్‌ చేసిన అభిమానులపైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి అతడిని బలవంతంగా అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. మరోవైపు.. పాక్‌ ఆటగాళ్లను దూషించిన ప్రేక్షకులను కూడా సెక్యూరిటీ అక్కడి నుంచి తరలించింది.

ఆటగాళ్లకు మద్దతుగా ప్రకటన
ఈ ఘటన వివాదానికి దారి తీయటంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తమ ఆటగాళ్లకు మద్దతుగా ప్రకటన విడుదల చేసింది. ‘‘పాకిస్తాన్‌ ఆటగాళ్ల పట్ల విదేశీ ప్రేక్షకులు అసభ్యంగా ప్రవర్తించిన తీరును పీసీబీ ఖండిస్తోంది. మైదానంలో ఉన్న ఆటగాళ్లను ఉద్దేశించి వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఖుష్దిల్‌ షా జోక్యం చేసుకుని.. దయచేసి ఇలా చేయవద్దని వారికి విజ్ఞప్తి చేశాడు. కానీ ఇందుకు బదులుగా అఫ్గన్‌ ప్రేక్షకులు పరిస్థితి మరింత శ్రుతిమించేలా పాష్తో భాషలో అసభ్యకర భాష వాడారు.

పాకిస్తానీ జట్టు ఫిర్యాదుతో స్టేడియం అధికారులు జోక్యం చేసుకుని.. ఇందుకు కారణమైన ఇద్దరు ప్రేక్షకులను అక్కడి నుంచి పంపించి వేశారు’’ అని పీసీబీ వివరణ ఇచ్చింది. 

వరుస ఓటములు
కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. సల్మాన్‌ ఆఘా సారథ్యంలో టీ20 సిరీస్‌ను 4-1తో కివీస్‌కు సమర్పించుకున్న పాక్‌.. మహ్మద్‌ రిజ్వాన్‌ సారథ్యంలో వన్డే సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.

అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌-సౌతాఫ్రికాతో త్రైపాక్షకి సిరీస్‌ను కివీస్‌కు కోల్పోయిన రిజ్వాన్‌ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్‌, టీమిండియా చేతుల్లో ఓడి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. 

చదవండి: NZ vs Pak: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన కివీస్‌..స్కోర్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement