కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్‌ | Not Pat Cummins Or Mitchell Starc, Rohit Sharma Names This Star As Toughest Australian Bowler To Face | Sakshi
Sakshi News home page

Rohit Sharma: కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం

Apr 17 2025 12:32 PM | Updated on Apr 17 2025 12:50 PM

Not Cummins Starc Rohit Names This Star As Toughest Australian Bowler To Face

దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆస్ట్రేలియా 2025లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT)ని గెలిచింది. టీమిండియాను 3-1తో ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇందుకు ప్రధాన కారణం ఆసీస్‌ పేసర్లే అని చెప్పడంలో సందేహం లేదు.

బుమ్రా@32
నిజానికి భారత పేస్‌ దళ నాయకుడు జస్‌‍ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 32 వికెట్లు కూల్చాడు. తద్వారా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా ఓడిపోవడంతో బుమ్రా ప్రదర్శనకు విలువ లేకుండా పోయింది.

హాజిల్‌వుడ్‌ స్థానంలో వచ్చి
ఇక.. ప్రపంచంలోని అత్యుత్తమ పేస్‌ త్రయంగా ఆస్ట్రేలియా పేసర్లు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins), మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లకు పేరు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో హాజిల్‌వుడ్‌ మూడు మ్యాచ్‌కు ముందు గాయపడగా.. అతడి స్థానంలో స్కాట్‌ బోలాండ్‌ వచ్చాడు. 

కమిన్స్‌, స్టార్క్‌తో కలిసి భారత్‌తో టెస్టుల్లో అతడు రాణించగా.. ఉత్తమ ఆఫ్‌ స్పిన్నర్లలో ఒకడైన నాథన్‌ లియోన్‌ వారికి సహకరించాడు.  బ్యాటర్లు కూడా తమ పనిని చక్కగా నెరవేర్చారు.

ఫలితంగా టీమిండియాపై ఆసీస్‌ పైచేయి సాధించడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు.. రోహిత్‌ సేనను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం చేసింది. ఈ సిరీస్‌ గురించి టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం
బీజీటీలో తమను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్‌ ఎవరన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘స్కాట్‌ బోలాండ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టమైంది. అతడి పిచ్‌ మ్యాప్‌ను మేము చెక్‌ చేస్తూనే ఉన్నాం. అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టే విషయమై సమాలోచనలు చేశాం.

ఫుల్‌ బాల్స్‌ లేవు. అంతా బంతిని వేసే కోణంలోనే ఉంది. అతడు నేరుగా పరిగెత్తుకు వస్తాడు. కాస్త జంప్‌ చేసి.. తన సీమ్‌ బౌలింగ్‌తో మ్యాజిక్‌ చేస్తాడు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో బుమ్రా తొమ్మిది ఇన్నింగ్స్‌లో 32 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్‌ సారథి పది ఇన్నింగ్స్‌లో కలిపి 25 వికెట్లు కూల్చగా.. బోలాండ్‌ ఆరు ఇన్నింగ్స్‌లోనే 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 10 ఇన్నింగ్స్‌లో 20 వికెట్లు.. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 10 ఇన్నింగ్స్‌లో 18 వికెట్లు కూల్చారు. 

తదుపరి ఇంగ్లండ్‌తో
ఇదిలా ఉంటే.. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌-2025తో బిజీగా  ఉన్నారు. ఈ టీ20 లీగ్‌కు ముందు టీమిండియా.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టైటిల్‌ గెలిచింది. ఇక ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్‌ ఆడేందుకు  ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

చదవండి: వికెట్‌ కాపాడుకోవటానికే ప్రాధాన్యం.. ఇలా అయితే కష్టం రాహుల్‌: పుజారా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement