మీ ప్రదర్శన అద్భుతం | Narendra Modi praised the Indian chess teams | Sakshi
Sakshi News home page

మీ ప్రదర్శన అద్భుతం

Sep 26 2024 4:05 AM | Updated on Sep 26 2024 4:05 AM

Narendra Modi praised the Indian chess teams

భారత చెస్‌ జట్లను ప్రశంసించిన నరేంద్ర మోదీ

పతక విజేతలతో భేటీ అయిన ప్రధానమంత్రి  

న్యూఢిల్లీ: బుడాపెస్ట్‌లో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన భారత చాంపియన్‌ గ్రాండ్‌మాస్టర్లు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో పసిడి పతకాలు సాధించి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన పురుషులు, మహిళల జట్లను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. 

అందరితోనూ చనువుగా మాట్లాడిన మోదీ వారి ప్రదర్శనను ఆకాశానికెత్తారు. మహిళా గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, మూడో ర్యాంకర్‌ ఇరిగేశి అర్జున్, ఆర్‌.ప్రజ్ఞానంద, విదిత్‌ సంతోష్‌ గుజరాతిలతో ప్రధాని ముచ్చటించారు. 11 గేమ్‌లకుగాను 10 గేముల్లో గెలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన దొమ్మరాజు గుకేశ్‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. 

ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలతో కలిసి మోదీ గేమ్‌ ఆడారు. అనంతరం విజేత సభ్యులంతా కలిసి తమ ఆటోగ్రాఫ్‌లతో కూడిన చెస్‌ బోర్డును ప్రధానికి అందజేశారు. ప్లేయర్లతో ప్రధాని ముఖా ముఖీ వీడియోను క్రీడాశాఖ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.  

డిఫెండింగ్‌ టైటిల్‌ను వదిలేసి... 
ప్రధానితో ప్రత్యేక భేటీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకోరాదనే ఉద్దేశంతో విదిత్‌ సంతోష్‌ గుజరాతి అజర్‌బైజాన్‌ టోర్నీ నుంచి వైదొలగి హుటాహుటిన ఢిల్లీకి తిరిగొచ్చాడు. 

గతేడాది బాకులో జరిగిన వుగార్‌ గాషిమోవ్‌ మెమోరియల్‌ చెస్‌ సూపర్‌ టోర్నమెంట్‌లో విదిత్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ నిలబెట్టుకునేందుకు బాకు చేరుకున్న అతనికి ప్రధాని భేటీకి సంబంధించిన సమాచారం వచ్చింది. దీంతో ఉన్నపళంగా డిఫెండింగ్‌ చాంపియన్‌íÙప్‌ను వదిలేసి ఢిల్లీకి పయనమై కార్యక్రమంలో పాల్గొన్నాడు.  
 
ఏఐసీఎఫ్‌ నజరానా రూ. 3 కోట్ల 20 లక్షలు 
చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్లకు అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) రూ. 3 కోట్ల 20 లక్షలు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. భారత పురుషుల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున.... భారత మహిళల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని ఏఐసీఎఫ్‌ అధ్యక్షుడు నితిన్‌ నారంగ్‌ ప్రకటించారు.

పురుషుల జట్టు కోచ్, కెప్టెన్‌ శ్రీనాథ్‌ నారాయణన్‌కు, మహిళల జట్టు కోచ్, కెప్టెన్‌ అభిజిత్‌ కుంతేకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. భారత బృందం చీఫ్‌ దివ్యేందు బారువాకు రూ. 10 లక్షలు, అసిస్టెంట్‌ కోచ్‌లకు రూ. 7 లక్షల 50 వేల చొప్పున లభిస్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement