ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం | Musheer Khan Slammed Century In England Against Notts 2nd 11 Team | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం

Jun 30 2025 8:27 PM | Updated on Jun 30 2025 9:24 PM

Musheer Khan Slammed Century In England Against Notts 2nd 11 Team

ప్రస్తుతం భారత క్రికెట్‌ మొత్తం ఇంగ్లండ్‌ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్‌-19 జట్టు ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో ఐదు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ ఆడుతుంది. 

భారత సీనియర్‌ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్‌ దివ్యాంగ టీమ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది.  

ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, ఖలీల్‌ అహ్మద్‌ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఆడుతున్నారు. వీరిలో తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ తమ ఎమర్జింగ్‌ జట్టును ఇంగ్లండ్‌కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్‌ సెకెండ్‌ 11తో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్‌ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్‌ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్‌ జట్లలో ఒక్క భారత సీనియర్‌ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్‌ చూశాయి. భారత సీనియర్‌ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలు కాగా.. అండర్‌-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్‌ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్‌ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్‌ పురుషుల జట్టులో జైస్వాల్‌, గిల్‌, రాహుల్‌, పంత్‌ (2).. సీనియర్‌ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో​ తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌.. తాజాగా ముషీర్‌ ఖాన్‌ శతకాలతో హోరెత్తించారు. 

ముషీర్‌ ఖాన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్‌ దేశవాలీ సీజన్‌లో అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్‌ ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement