
Photo Courtesy: BCCI/IPL
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) రిటైర్డ్ అవుట్గా వెనుదిరగడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో వచ్చిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానం నుంచి నిష్క్రమించాడు. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.
ఈ నేపథ్యంలో స్పెషలిస్టు బ్యాటర్ను పెవిలియన్కు పంపి.. ఆల్రౌండర్ను రప్పించిన ముంబై నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లక్నో చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ విషయంపై స్పందించాడు.
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం
‘‘ఆఖర్లో మాకు హిట్టింగ్ ఆడే ఆటగాడు కావాలని అనుకున్నాం. క్రికెట్లో ఇలాంటివి సహజం. అయితే, ఒక్కోసారి మన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయితే, వ్యూహాలు పక్కాగా అమలు చేస్తామని అనుకోవడంలో తప్పులేదు.
ఒక్కోసారి ఇంకాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్లో స్మార్ట్గా ఉండాలి. బ్యాటింగ్లో వివిధ ఆప్షన్లు ప్రయత్నించాలి. మనదైన శైలిలో ఆడుతూనే దూకుడు ప్రదర్శించగలగాలి’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఓటమికి కారణం అదే
ఇక లక్నో చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్న హార్దిక్ పాండ్యా.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు. అయితే, తనకు ఏకనా వికెట్ మీద ప్రయోగాలు చేసేందుకు ఎక్కువగా ఆప్షన్లు దొరకలేదని.. వికెట్లు తీయడం కంటే కూడా తాము డాట్ బాల్స్ వేసేందుకే ఎక్కువగా ప్రయత్నించామని తెలిపాడు. బ్యాటర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపిందని.. తమ పరాజయానికి అదే కారణమని పేర్కొన్నాడు.
లక్నో ఓపెనర్లు ధనాధన్
కాగా ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో లక్నో- ముంబై జట్లు తలపడ్డాయి. సొంత మైదానం ఏకనాలో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60), ఐడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53) అదరగొట్టగా.. నికోలస్ పూరన్ (12), కెప్టెన్ రిషభ్ పంత్ (2) పూర్తిగా నిరాశపరిచారు.
ఈ క్రమంలో ఆయుశ్ బదోని (19 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27) మెరుపు బ్యాటింగ్తో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ ఐదు, ఆవేశ్ ఖాన్ రెండు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి లక్నో 203 పరుగులు స్కోరు చేసింది.
ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. విఘ్నేశ్ పుతూర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లు విల్ జాక్స్ (5), రియాన్ రికెల్టన్ (10) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు.
నమన్, సూర్య, హార్దిక్ పోరాటం వృథా
ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్.. సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నమన్ 24 బంతుల్లో 46 రన్స్ చేయగా.. సూర్య 43 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డ తిలక్ వర్మ 23 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసిన క్రమంలో.. మేనేజ్మెంట్ అతడిని వెనక్కి పిలిపించింది.
Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯
Only the 4th time a batter has retired out in the IPL!
Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025
అప్పటికి ముంబై విజయానికి 24 పరుగులు కావాల్సి ఉండగా.. మిగిలింది కేవలం ఏడు బంతులు మాత్రమే. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 28 నాటౌట్) క్రీజులో ఉండగా.. తిలక్ స్థానంలో సాంట్నర్ వచ్చాడు. అయితే, ఆఖరి ఓవర్ను లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా వేసి.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు.
దీంతో ముంబై 191 పరుగుల వద్ద నిలిచిపోయి.. 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీయగా.. పొదుపుగా బౌలింగ్ చేసి నమన్ వికెట్ తీసిన దిగ్వేశ్ సింగ్ రాఠి (1/21)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ముంబై ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని.. ఒక్కటి మాత్రమే గెలిచింది.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్గా
Just the breakthrough #LSG needed!
Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊
Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025