IPL 2027: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ! | MI to decide Hardik Fate next week Bumrah vs Tilak Varma for captaincy | Sakshi
Sakshi News home page

IPL 2027: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ!

Jul 15 2026 2:24 PM | Updated on Jul 15 2026 3:14 PM

MI to decide Hardik Fate next week Bumrah vs Tilak Varma for captaincy

తిలక్‌ వర్మ (PC: BCCI X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి జట్టు ముంబై ఇండియన్స్‌. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.

అయితే, అనూహ్య రీతిలో 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. హిట్‌మ్యాన్‌ స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న తమ మాజీ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, రోహిత్‌పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్‌ చేయడాన్ని సొంతజట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.

ఘోర పరాజయాలు
హార్దిక్‌తో పాటు ముంబై యాజమాన్యాన్నీ భారీ ఎత్తున ట్రోల్‌ చేశారు. అందుకు తగ్గట్లుగానే 2024లో ముంబై ఘోర పరాజయాలు చవిచూసింది. పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. అయితే, గతేడాది మాత్రం ప్లే ఆఫ్స్‌ చేరి పరువు నిలబెట్టుకుంది.

కానీ తాజా సీజన్‌లో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఐపీఎల్‌-2026లో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి.

జట్టును వీడుతున్న హార్దిక్‌
ఈ క్రమంలో హార్దిక్‌ సైతం ముంబై జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు. అతడిని ట్రేడ్‌ చేసుకునేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. చెన్నై జట్టుతో చేరేందుకు హార్దిక్‌ కూడా ఇంట్రస్ట్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ ఎవరా అన్న చర్చ మొదలైంది. ఈ విషయం గురించి వచ్చే వారానికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అందించిన కథనం ప్రకారం.. 2026లో జట్టు ప్రదర్శన గురించి హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనెతో వచ్చేవారం ముంబై యాజమాన్యం సమీక్ష నిర్వహించనుంది.

కెప్టెన్‌గా తిలక్‌ వర్మ!
హార్దిక్‌ పాండ్యా ట్రేడింగ్‌ అంశంతో పాటు.. కొత్త కెప్టెన్‌గా ఎవరిని నియమించాలన్న విషయం గురించి కూడా మేనేజ్‌మెంట్‌ చర్చించనుంది. కెప్టెన్సీ రేసులో టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు.. టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అనుభవం, ప్రతిభ పరంగా బుమ్రావైపే యాజమాన్యం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పేస్‌బౌలర్‌ తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇక యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలనుకుంటే మాత్రం తిలక్‌ వర్మనే కెప్టెన్‌గా ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

బుమ్రాను కాదని తిలక్‌కు ఇస్తారా?
తిలక్‌ చుట్టూ కొత్త జట్టును నిర్మించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 2022లో ముంబై జట్టుతో చేరిన ఈ హైదరాబాదీ స్టార్‌.. ప్రతి సీజన్‌లోనూ ఇప్పటికి 300కు పైగా పరుగులు చేశాడు. అయితే, ఇటీవల.. ముఖ్యంగా టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తిలక్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 

ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అతడిని జట్టు నుంచే తొలగించాలంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వంటి మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేశారు. అయితే, ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా తిలక్‌ మెరుపు అర్ధ శతకం (25 బంతుల్లో 53)తో రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. ఇంగ్లండ్‌ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.

చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement