బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! | Harry Brook Leaves Press Conference-Questions-Bumrah-Taken-Wicket | Sakshi
Sakshi News home page

బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!

Jul 15 2026 12:02 PM | Updated on Jul 15 2026 1:17 PM

Harry Brook Leaves Press Conference-Questions-Bumrah-Taken-Wicket

Photo Credit: ECB Twitter

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విఫలమయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి  భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు దొరికిపోయాడు. మ్యాచ్ ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన బ్రూక్‌కు బుమ్రా గురించి ప్రశ్న వేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. 

బుమ్రా బౌలింగ్‌లో ఔటవ్వడంపై మీ స్పందనేంటి అని విలేకరులు బ్రూక్‌కు ప్రశ్న వేశారు. దీనిపై బ్రూక్ స్పందిస్తూ.. ‘బుమ్రా మంచి బౌలర్‌. నాకు వేసిన బంతి బౌన్స్ కావడం వల్ల షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాను. దీంతో ఔట్ కావాల్సి వచ్చింది’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత రిపోర్టర్లు మరో ప్రశ్న అడుగుతుండగానే బ్రూక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే వన్డే సిరీస్ కంటే ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హ్యారీ బ్రూక్ 229 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదో టీ20 మ్యాచ్‌లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (45 బంతుల్లో 95 నాటౌట్‌) ఆడడం విశేషం. అయితే వన్డే ఫార్మాట్‌కు రాగానే హ్యారీ బ్రూక్ ఆట మారిపోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసి బుమ్రాకు దొరికిపోయాడు. అయితే వన్డేల్లో బ్రూక్‌, బుమ్రా ఎదురుపడడం ఇదే తొలిసారి. 

2026 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో కూడా బ్రూక్.. బుమ్రాకే వికెట్ సమర్పించుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో కూడా బ్రూక్‌ను బుమ్రా ఒకసారి ఔట్ చేశాడు. తాజాగా వన్డేలోనూ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా అతడి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

మ్యాచ్ ఓట‌మిపై బ్రూక్ స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మారిపోయింద‌న్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో త‌ర‌హాలోనే స్పందించి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌న్నాడు. బ్యాట‌ర్లు ఈజీగా ప‌రుగులు చేసేలా మారింద‌న్నాడు. ఓవ‌ర్‌కు 5 నుంచి 6 ప‌రుగులే చేయాల్సి ఉండ‌డంతో ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్లు స్వేచ్ఛ‌గా ఆడి ప‌రుగులు సాధించార‌న్నాడు. 

ఇక తాము ఎప్పుడూ కూడా పిచ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జ‌ట్టును ఎంపిక చేస్తామ‌న్నాడు. బ్యాట‌ర్లు ఇంకొన్ని ప‌రుగులు చేసి ఉంటే త‌మ స్పిన్న‌ర్లు ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేసి ఉండేవార‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇక రెండో వ‌న్డేలో జ‌ట్టు కాంబినేష‌న్ గురించి ఇంకా ఆలోచిం చ‌లేద‌న్నాడు. ఆ మ్యాచ్‌కు వేదిక అయిన‌ కార్డిఫ్ కు వెళ్లిన త‌రువాత అక్క‌డి పిచ్‌ను ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నాడు. 

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా కార్డిఫ్‌ వేదికగా రెండో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనే గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

 

Read: ఫిఫా వీఏఆర్‌పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement