
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్- ఆర్సీబీ స్టార్ కోహ్లి (PC: BCCI)
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకోగా.. మిగతా తొమ్మిది జట్లు పదేసి మ్యాచ్లు ఆడేశాయి. ఈ క్రమంలో ముంబై, రాజస్తాన్కి ఇంకో మూడు.. మిగతా జట్లకు మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
అగ్రస్థానంలో
ఇక ఇప్పటికి పదకొండింట ఏడు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా ఏడేసి మ్యాచ్లు గెలిచినా.. రన్రేటు పరంగా వెనుకబడి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో ఆరు మ్యాచ్లు గెలిచి ఇదే తరహాలో నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. మరోవైపు.. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు విజయాలతో ఏడు, రాజస్తాన్ రాయల్స్ మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.
అట్టడుగున
అదే విధంగా.. సన్రైజర్స్ హైదరాబాద్ మూడు , చెన్నై సూపర్ కింగ్స్ రెండు మాత్రమే గెలిచి అట్టడుగున తొమ్మిది, పది స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్ విజేతగా నిలవగా.. సన్రైజర్స్ రన్నరప్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.
ఈసారి ఈ రెండు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. మరోవైపు.. ఇంత వరకు టైటిల్ గెలవని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మాత్రం అదరగొడుతున్నాయి.
ముఖ్యంగా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ సరికొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లికి ఓపెనింగ్ జోడీగా వచ్చిన ఫిల్ సాల్ట్ అదరగొడుతుండగా.. బ్యాటర్గానూ రజత్ రాణిస్తున్నాడు. మరోవైపు.. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్రభావం చూపుతుండగా.. స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం
ఇప్పటికి గెలిచిన ఏడు మ్యాచ్లలో ఐదుగురు వేర్వేరు ప్లేయర్లు (కోహ్లి, కృనాల్ పాండ్యా (3), పాటిదార్ (2), ఫిల్ సాల్ట్, హాజిల్వుడ్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడం వారి సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం. మొత్తానికి ఈసారి కలిసికట్టుగా రాణిస్తూ ఆర్సీబీ టైటిల్ గెలవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తోంది.
టైటిల్ గెలిచేది ఆ జట్టే..
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది.
వాళ్ల ఫీల్డింగ్ కూడా సూపర్. ముంబై ఇండియన్స్ కూడా అదరగొడుతోంది. అయితే, మిగతా మ్యాచ్లలో కూడా వారు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము.
అయితే, ఇదే జోరు కనబరిస్తే వాళ్లకు తిరుగు ఉండదు. కానీ.. ఈసారి మాత్రం ఆర్సీబీనే టైటిల్ ఫేవరెట్గా కనిపిస్తోంది’’ అని గావస్కర్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడబోతోందని సన్నీ జోస్యం చెప్పాడు.
చదవండి: Shubman Gill: అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని!