ఐపీఎల్-2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సమూల మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఢిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ చేపట్టాడు. అతడి సారథ్యంలోని ఢిల్లీ గత రెండు సీజన్లలోనూ కనీసం ప్లే ఆఫ్స్నకు చేరలేకపోయింది. దీంతో ఢిల్లీ యాజమాన్యం అక్షర్ కెప్టెన్సీపై ఆసంతృప్తిగా ఉందంట.
దీంతో అక్షర్ స్ధానంలో రాహుల్ను సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. ఒకవేళ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపడితే.. ఐపీఎల్లో ఆయన సారథ్యం వహించబోయే మూడో జట్టు ఢిల్లీ కానుంది.
గతంలో అతడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ఫుల్ టైమ్ కెప్టెన్గా వ్యవహరించాడు. రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఆ జట్టు తరపున 539 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన రాహుల్.. ఐపీఎల్-2026లో కూడా అదరగొట్టాడు. కేవలం 14 ఇన్నింగ్స్ల్లోనే 45.61 సగటుతో, 174.41 భారీ స్ట్రైక్ రేట్తో 593 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధసెంచరీలు, ఒక అద్భుత శతకం ఉన్నాయి.
రిషబ్ పంత్ రీఎంట్రీ!
ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ను డ్రేడ్ స్వాప్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తుందంట. అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను లక్నోకు ఇచ్చేందుకు ఢిల్లీ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్-2026లో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఇటీవల లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. అంతకుముందు రిషబ్ తన ఐపీఎల్ కెరీర్ను ఢిల్లీ క్యాపిటల్స్తోనే ప్రారంభించాడు. ఆ తర్వాత కెప్టెన్గా పనిచేశాడు. మళ్లీ ఇప్పుడు తన సొంత గూటికి వెళ్తే తన పూర్వ వైభవాన్ని పొందే అవకాశముంది.
చదవండి: IPL 2027: యువరాజ్ సింగ్ ఐపీఎల్ రీఎంట్రీ?


