Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్‌ | Is This Just To Secure BCCI Contracts: Gavaskar Slams Rohit Sharma | Sakshi
Sakshi News home page

Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్‌

Jan 28 2025 4:03 PM | Updated on Jan 28 2025 4:21 PM

Is This Just To Secure BCCI Contracts: Gavaskar Slams Rohit Sharma

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)పై భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) విమర్శలు గుప్పించాడు. ఈ ఇద్దరు ఏదో మొక్కుబడిగా రంజీలు ఆడుతున్నారే తప్ప.. జట్టును గెలిపించాలనే తపన కనిపించలేదన్నాడు. టెక్నిక్‌తో బ్యాటింగ్‌ చేయాల్సిన చోట.. దూకుడు ప్రదర్శించి వికెట్లు పారేసుకోవడం సరికాదని హితవు పలికాడు.

కాగా ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్‌ కావడం సహా.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని చేజార్చుకుంది.

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా  విఫలం
ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆసీస్‌ గడ్డపై కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు ఇక రిటైర్మెంట్‌ ప్రకటించాలంటూ రోహిత్‌కు మాజీ ‍క్రికెటర్ల నుంచి సూచనలు వచ్చాయి.

అయితే, ఇప్పట్లో తాను టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలగబోనని రోహిత్‌ శర్మ కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంతజట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌ ఆడాడు.

రంజీల్లోనూ నిరాశే
కానీ.. ఇక్కడ కూడా రోహిత్‌ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు. మరో టీమిండియా స్టార్‌, ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌ చేతిలో.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. నిజానికి ముంబై కాస్తైనా పరువు నిలబెట్టుకుందంటే అందుకు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లే కారణం.

చెలరేగిన శార్దూల్‌, తనుశ్‌
తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు అర్థ శతకం(57 బంతుల్లో 51) బాదిన పేస్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో శతకం(119)తో సత్తా చాటాడు,. ఇక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియాన్‌ సైతం 26, 62 పరుగులు చేశాడు. ఇక శార్దూల్‌ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా తీశాడు.

ఈ నేపథ్యంలో ముంబై మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ల ఆట తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. అసలు ఆడాలన్న కసి కూడా వారిలో కనిపించలేదు.

కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?
వీళ్లు నిజంగానే రంజీలు ఆడాలనుకున్నారా. లేదంటే.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు కోల్పోకూడదు, వాటిపై ప్రభావం పడకూడదన్న ఏకైక కారణంతోనే బరిలోకి దిగారా? అనిపించింది. మరోవైపు.. శార్దూల్‌.. తనూశ్‌.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో జాగ్రత్తగా ఆడుతూనే.. దూకుడుగా ఎలా ఉండాలో చూపించారు’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

ఏదేమైనా రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ వంటి టీమిండియా స్టార్లు ఈ టోర్నీలో ఆడటం వల్ల యువ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని గావస్కర్‌ అన్నాడు. వీరి నుంచి ఆయుశ్‌ మాత్రే వంటి వాళ్లు సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలు కలిగిందని పేర్కొన్నాడు.

కాగా వరుస సెంచరీలతో జోరు మీదున్న ఆయుశ్‌ మాత్రే.. రోహిత్‌ శర్మ కోసం జట్టులో తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మరోవైపు.. యశస్వి జైస్వాల్‌(4, 26) కూడా రోహిత్‌కు ఓపెనింగ్‌ జోడీగా దిగి.. ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

చదవండి: Ab De Villiers: సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్‌.. టీ20 టోర్నీతో రీఎంట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement