చరిత్ర సృష్టించిన జస్ప్రీత్‌ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Jasprit Bumrah Creates History; Breaks Bhuvneshwar Kumar World Record In T20Is | Sakshi
Sakshi News home page

T20 WC: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్‌ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Jun 6 2024 5:07 PM | Updated on Jun 6 2024 5:22 PM

Jasprit Bumrah Creates History, Breaks Bhuvneshwar Kumars World Record

టీ20 వరల్డ్‌కప్‌-2024లో న్యూయర్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో అర్షదీప్ సింగ్ భారత బౌలింగ్‌ ఎటాక్‌ను ప్రారంభించగా.. మహమ్మద్ సిరాజ్ అతడితో పాటు బంతిని పంచుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌ ఎటాక్‌కు వచ్చాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ఐరీష్‌ బ్యాటర్లను బుమ్రా బెంబేలెత్తించాడు. 

బుమ్రా తన బౌలింగ్‌ ఎటాక్‌ను మెయిడిన్‌ ఓవర్‌తో ప్రారంభించాడు. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ వేసిన బుమ్రా.. ఐర్లాండ్‌ బ్యాటర్‌ హ్యారీ టెక్టార్‌కు చుక్కలు చూపించాడు. బుమ్రా బౌలింగ్‌ దాటికి ఆ ఓవర్‌లో టెక్టార్‌ కనీసం ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.

ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మెయిడిన్‌లు (టెస్టు సభ్యత్వ దేశాలు) చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఇప్పటివరకు టీ20ల్లో 11 మెయిడిన్ ఓవర్లు వేశాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్‌ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీని బుమ్రా అధిగమించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా.. 3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక ఓవరాల్‌గా  ఈ జాబితాలో  ఇద్దరు బౌలర్లు బుమ్రా కంటే ముందు ఉన్నారు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో తొలి స్ధానంలో ఉండగా.. కెన్యా బౌలర్ షెబ్ ఎన్గోచె 14 రెండు స్దానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement