నెట్ ప్రాక్టీస్లో ఆసక్తికర పోరు
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సమయంలో గాయంతో తప్పుకున్న బుమ్రా... ఇప్పుడు కోలుకొని అఫ్గానిస్తాన్తో సిరీస్కు సిద్ధమయ్యాడు. శుక్రవారం అతను ఫిరోజ్షా కోట్లా మైదానంలో ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. సాధనలో బుమ్రాకు ఎదురుగా నిలిచింది 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. వీరిద్దరి మధ్య నెట్స్లో ఆసక్తికర పోరు సాగింది.
ఐపీఎల్లో ఇప్పటికే బుమ్రాను ఎదుర్కొన్న వైభవ్... ఇక్కడ మాత్రం తగిన రీతిలో జవాబివ్వడంలో విఫలమయ్యాడు. బుమ్రా వరుసగా వేసిన పదునైన బంతులకు వైభవ్ వద్ద సమాధానం లేకపోయింది. అతికష్టమ్మీద వాటిని ఎదుర్కొన్న అతను... ఒకటి, రెండు బంతులను మాత్రం నియంత్రణతో మంచి షాట్లుగా మలిచాడు. ఇతర పేసర్లు అర్ష్ దీప్ సింగ్, యశ్ ఠాకూర్ల బౌలింగ్లో కూడా వైభవ్ సమర్థంగా ఆడలేకపోయాడు.
దాంతోపాటు పలుమార్లుసునాయాస ఏరియల్ క్యాచ్లు వదిలేసి ఫీల్డింగ్లో కూడా ఈ బిహార్ కుర్రాడు నిరాశపర్చాడు. మరోవైపు నెట్స్లో భారత టి20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బుమ్రా బౌలింగ్లో మెరుగ్గా ఆడలేకపోయాడు. ఇక్కడా బుమ్రా ఆధిపత్యమే సాగింది. అతను పూర్తి ఫిట్గా ఉండటంతో పాటు తనదైన శైలిలో బౌలింగ్ చేస్తున్న తీరు భారత టీమ్ మేనేజ్మెంట్కు సంతృప్తిని కలిగించిందనడంలో సందేహం లేదు.


