source: X
నమీబియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పర్యాటక సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి వన్డేలో భారీ విజయం (99 పరుగుల తేడాతో) సాధించిన ప్రొటీస్ జట్టు.. ఇవాళ జరిగిన రెండో వన్డేలో అంతకంటే భారీ విజయం (157 పరుగుల తేడాతో) సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది.
విండ్హోక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. ఓపెనర్ కానర్ ఎస్టర్హుయిజెన్ సూపర్ శతకం (110 బంతుల్లో 119; 8 ఫోర్లు, 6 సిక్సర్లు)తో చెలరేగగా.. వన్డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి (79) అర్ద సెంచరీతో రాణించాడు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసెల్ 4 వికెట్లతో రాణించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఆదిలోనే చేతులెత్తేసింది. ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమి ఖరారు చేసుకుంది.
ఈ దశలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (68) కాసేపు ప్రతిఘటించాడు. 136 పరుగుల వద్ద అతడు కూడా ఔట్ కావడంతో నమీబియా ఓటమి లాంఛనమైంది. చివరికి ఆ జట్టు 41.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో డి జన్సెన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఈథన్ బాష్ 3, మొకేనా, జేసన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని నామమాత్రపు చివరి వన్డే సెప్టెంబర్ 13న జరుగనుంది.
ఇదీ చదవండి: సూపర్ శతకం.. సౌతాఫ్రికా బ్యాటర్ ప్రపంచ రికార్డు


