వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా? | IPL 2026: Vaibhav Sooryavanshi pranks young RR fans in viral video | Sakshi
Sakshi News home page

వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?

Apr 27 2026 4:40 PM | Updated on Apr 27 2026 4:45 PM

IPL 2026: Vaibhav Sooryavanshi pranks young RR fans in viral video

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న సూర్యవంశీ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తోన్న వైభవ్ తాజాగా తనతో ఫొటో దిగాలని వచ్చిన ఇద్దరు చిన్న పిల్లలను ఆటపట్టించడం ఆసక్తికరంగా మారింది. 

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్తాన్ రాయల్స్ జట్టు తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడేందుకు ముల్లన్‌పూర్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగిన వైభవ్ వద్దకు ఇద్దరు పిల్లలు వచ్చి ఫొటో దిగాలని అడిగారు. తాను ఫొటో దిగేందుకు రెడీనే అని, కానీ తాను ఏదీ ఉచితంగా చేయనని పేర్కొన్నాడు. 

వైభవ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్‌.. నేను మీతో ఫొటో దిగాలంటే మీరు ఒక్కో ఫొటోకు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నాడు. దీంతో పిల్లలు 200 రూపాయలు తీసుకొచ్చి వైభవ్ చేతిలో పెట్టారు. అయితే డబ్బులు పిల్లలకు తిరిగి ఇచ్చిన వైభవ్..‘ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే.. మీ డబ్బులు మీరు తీసుకోండి’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులను దగ్గరికి తీసుకొని వారితో ఫొటో దిగాడు. 

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. 

వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. ఇందులో 31 బౌండరీలు, 32 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లాడి 5 విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో ఆడ‌నుంది.

చదవండి: గిల్‌పై బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు!

Advertisement
 
Advertisement
Advertisement