తృణమూల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో, తిరుగుబాటు ఎంపీల జాబితాతో తన పేరును ముడిపెడుతున్న వార్తలను టీఎంసీ సీనియర్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఖండించారు. తాను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు.
లోక్సభ స్పీకర్కు తృణమూల్ "అసమ్మతి" వర్గం సమర్పించిన లేఖపై సంతకం చేసిన వారిలో శతృఘ్న సిన్హా కూడా ఉన్నారనే వార్తల నడుమ, ఎక్స్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన భారత ప్రధానిగా రికార్డు సృష్టించినందుకు ప్రధాని మోదీని అభినందించడంతో పాటు, ఈ పోస్ట్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఊహాగానాలకు తెరలేపింది. అయితే ఈ వార్తలను నటుడు శతృఘ్న సిన్హా గురువారం కొట్టిపారేశారు.
ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని అసమ్మతి వర్గంలో తాను ఉన్నట్లు వస్తున్న పుకార్లను ఖండించారు. కష్టకాలంలో మమతా తనకు అండగా నిలిచారు, ఈ కష్ట సమయాల్లోమమతకు అండగా ఉంటానని ప్రకటించారు. నిజానికి ఆమె ఒత్తిడి మేరకే తాను అసన్సోల్ నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశానని చెబుతూ.. తాను "దీదీని ఎప్పటికీ వీడను" అని సిన్హా స్పష్టం చేశారు. అటు తాను మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతోనే ఉంటానని, తిరుగుబాటు శిబిరంలో చేరబోనని గాయకుడు, టీఎంసీ ఎంపీ బాబుల్ సుప్రియో స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ఓడను వదిలేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మరే ఇతర పార్టీలోనూ చేరడం లేదని కూడా స్పష్టం చేశారు.
కాంగ్రెస్లో విలీనం లేదు
మరోవైపు, టీఎంసీలో విలీనం అవుతోందన్న వార్తలు నిరాధారమైనవని కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో సహా ఇండియా బ్లాక్ నాయకులను కలిసిన మమతా బెనర్జీ, తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని పశ్చిమ బెంగాల్కు తిరిగి వచ్చారు. నకిలీ సంతకాల వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఐడీ సమన్లు జారీ చేసినప్పటికీ, అభిషేక్ బెనర్జీ ఢిల్లీలోనే ఉన్నారు, ఆయన కోల్కతాకు ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఎన్నికల సంఘమే తేలుస్తుంది
తిరుగుబాటు టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్, తమ గ్రూపుకు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మద్దతు ఉందని, ఎన్డీఏకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యే రీటాబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గంతో తమ తిరుగుబాటు ఎంపీలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఏ వర్గం అసలైన టీఎంసీనో ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందన్నారు.
ఇదీ చదవండి: తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
శతృఘ్న సిన్హా రాజకీయ ప్రస్థానం:
కాగా బాలీవుడ్ హీరోశతృఘ్న సిన్హా తన రాజకీయ జీవితం బీజేపీతోనే ప్రారంభమూంది. దశాబ్దాల పాటు ప్రముఖ బీజేపీ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన సైద్ధాంతిక విభేదాలతో పార్టీని వీడారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో, ఆయన మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అనంతరం జరిగిన అసన్సోల్ లోక్సభ ఉపఎన్నికలో విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ టిఎంసి అభ్యర్థిగా పోటీ చేసి అసన్సోల్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్


