కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీకి చెందిన టీఎంసీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. ఆమ్తాలాలో ఆ 5 అంతస్తుల కార్యాలయం ఉంటుంది. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ 5 అంతస్తుల భవన నిర్మాణానికి అభిషేక్ బెనర్జీ అనుమతులు తీసుకోలేదు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారని అధికారులు ఆరోపించారు.
భారీ భద్రత నడుమ ఎక్స్కవేటర్లతో కూల్చివేత చర్యలు చేపట్టారు. బెంగాల్ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది అక్కడ మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి ఆమ్తాలాలో వస్తుంది. కూల్చివేత తర్వాత అక్కడ చేరిన బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఆమ్తాలా ఎమ్మెల్యే, బీజేపీ నేత అగ్నీశ్వర్ నస్కర్ ఈ చర్యను స్వాగతించారు. భవనం నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారని ఆరోపించారు. "ఈ నిర్మాణం అక్రమంగా జరిగింది. చట్టానికి అనుగుణంగా పాలన యంత్రాంగం చివరకు చర్య తీసుకుంది" అని నస్కర్ అన్నారు.
అనుమతి లేకుండా నిర్మాణం జరిగిందని వచ్చిన ఫిర్యాదుల తర్వాత ఈ చర్య చేపట్టామని జిల్లా పాలన యంత్రాంగ అధికారులు తెలిపారు. చట్టబద్ధ ప్రక్రియలో భాగంగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
"చట్ట నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా పాలన యంత్రాంగం ప్రక్రియ మొదలుపెట్టింది. అనుమతి లేకుండా నిర్మాణం జరిగిందన్న ఫిర్యాదులు రావడంతో నోటీసులు జారీ చేశాం. ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది" అని దక్షిణ 24 పరగణాల జిల్లా పాలన యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. "విచారణ పూర్తైన తర్వాత, సంబంధిత చట్ట నిబంధనలకు అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని ఆ అధికారి చెప్పారు.
శనివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయం చుట్టూ అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ గార్డ్రెయిల్స్ ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు, పౌర పాలన యంత్రాంగ అధికారులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు.
"ప్రక్రియ ప్రశాంతంగా, చట్టానికి అనుగుణంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. కూల్చివేత పని పూర్తిగా చట్టబద్ధ ప్రక్రియ ఆధారంగానే జరుగుతోంది" అని ఆ అధికారి తెలిపారు. జిల్లా పాలన యంత్రాంగం జారీ చేసిన నోటీసుల ప్రకారం, పార్టీ కార్యాలయం ఉన్న భూమిని లీప్స్ అండ్ బౌండ్స్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆ నోటీసుల్లో భూమి యాజమాన్య పత్రాలు, నిర్మాణానికి సంబంధించిన రికార్డులపై కూడా వివరణ కోరారు. సంబంధిత వ్యక్తులకు జారీ చేసిన రెండు నోటీసులకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కూల్చివేత చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్టు పాలన యంత్రాంగ వర్గాలు తెలిపాయి.


