
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 22) ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. ఈ సీజన్లో పంత్కు ఇది రెండో డకౌట్.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో పంత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చెత్త ఆటతీరు, కెప్టెన్గా తీసుకున్న చెత్త నిర్ణయాలు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో లక్నో కొంపముంచాయి.
ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ మంచి ఆరంభం ఇచ్చినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించారు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రాహుల్ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్ లాంటి చెత్తను రూ. 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
రాహుల్ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు.
కాగా, నిన్నటి మ్యాచ్లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు రాకుండా పెద్ద తప్పిదమే చేశాడు. మూడో స్థానంలో కాకపోయినా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోరే చేసేది.
బ్యాటింగ్లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ రెచ్చిపోయారు.
రాహుల్ గత సీజన్లో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేతిలో ఎదురైన అవమానానికి నిన్నటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. రాహుల్ గొయెంకాకు బ్యాట్తో బుద్ది చెప్పడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు రివెంజ్ తీర్చుకున్నాడు.
గొయెంకా కరచాలనం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయగా రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో గొయెంకా పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ. లోలోపల రాహుల్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు బెంబేలెత్తిపోయుంటాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.